ఏదో ఓ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేయటం చంద్రబాబునాయుడుకు అలవాటుగా మారిపోయింది.
తాజాగా మొదలైన నవ నిర్మాణ దీక్షలే మంచి ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్ర విభజన సెంటిమెంటును లైవ్ లో పెట్టి వచ్చే ఎన్నికల్లో తిరిగి లబ్ది పొందాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు తగ్గట్లే ప్రజలను మాయ చేయటం కోసం ఎప్పటికప్పుడు ఏదో కథలు చెబుతూనే ఉన్నారు. నిజానికి రాష్ట్ర విభజన ఏపిలోని జనాలకు ఇష్టంలేదన్నది వాస్తవమే. అయినా జరిగిపోయింది. అందులోనూ అడ్డదిడ్డంగా జరిగిన విభజన చేసిందన్న కోపంతోనే జనాలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేశారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో బిజెపి, టిడిపిలకూ అంతే భాగస్వామ్య ముంది. కాకపోతే అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నే జనాలు శిక్షించారు. అదృష్టం ఉంది కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రైపోయారు. అంతేకానీ ఏదో సీనియారిటీ ఉందనో లేకపోతే రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతోనో చంద్రబాబుకు పట్టం కట్టలేదు.
పాలన ఫెయిల్యూరేనా ?
సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పాలన ఎలాగుంది ? అంటే అది వేరే సంగతి. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇంత చెత్తపాలన సాగుతుందని జనాలు ఏమాత్రం అనుమానించి ఉన్నా రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులు వేరే విధంగా ఉండేదనటంలో సందేహమే లేదు. ఏదేమైనా చంద్రబాబు నాలుగేళ్ళ పాలన ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే, కేంద్రంతో కలిసున్నపుడే రాష్ట్రానికి ఏమీ సాధించలేని సీనియర్ మోస్ట్ నేతగా చంద్రబాబు ముద్ర వేసుకున్నారు.
జనాల దృష్టి మళ్ళించేందుకేనా ?
అందుకనే తన పాలన నుండి జనాల దృష్టిని మళ్ళించేందుకు చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. నాలుగేళ్ళుగా జరుగుతున్న నవ నిర్మాణ దీక్షలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తాజాగా మళ్ళీ అటువంటి దీక్షలే మొన్న జూన్ 2వ తేదీ నుండి మొదలయ్యాయి. 10వ తేదీ వరకూ జరిగే దీక్షలకు ప్రభుత్వం తరపున రూ. 13 కోట్లు ఖర్చుపెడుతున్నారు. అంటే ఇప్పటికి నాలుగేళ్ళల్లో సుమారుగా 60 కోట్లు వ్యయమై ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ దీక్షల వల్ల జనాలకేం ఉపయోగమంటే ఏమీ లేదనే సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా జనాల్లో రాష్ట్ర విభజన తాలూకు కసి ఏమీ లేదు. అందుకే జరుగుతున్న దీక్షల్లో జనాలు ఎక్కడా కనబడటం లేదు.
విజయవాడలోనే జనాలు లేరు
జూన్ 2వ తేదీన విజయవాడలోని బెంజి సర్కిల్లో స్వయంగా చంద్రబాబే పాల్గొన్న దీక్షలకే జనాలు కరువయ్యారు. దీక్షలో వేలాదిమంది జనాలు పాల్గొంటారన్న ఉద్దేశ్యంతో వేయించిన కుర్చీల్లో వందల సంఖ్య కూడా నిండలేదు. చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమం పరిస్ధితే ఈ విధంగ ఉంటే ఇక జిల్లాల పరిస్దితి గురించి ఆలోచించనే అక్కర్లేదు. అంటే ఇక్కడ అర్ధమవుతోంది ఏంటంటే ఏదో పేరుతో జనాల దృష్టిని మళ్ళించటం అందుకు కోట్ల రూపాయలు వృధా చేయటం తప్ప ఇంకేమీ జరగటం లేదు. దీనికి అదనంగా ఎక్కడికెళ్ళినా సొంత విమానాల్లో ప్రయాణం, వివిధ పథకాలకు ప్రచారం పేరుతో చేస్తున్న ఖర్చు మొత్తం కలుపుకుంటే ప్రతీ సంవత్సరం వందల కోట్లు వృధా తప్ప ఇంకేమీ లేదు.