అమెరికా అధ్యక్షుడికి కరోనా ఉందా.. లేదా అనే అనుమానాలకు తెరపడింది. ట్రంప్ కు కరోనా నెగటివ్ వచ్చింది. గతంలో ట్రంప్ ను కలిసిన ఇతర దేశాల నేతలకు కరోనా రావడంతో.. ప్రెసిడెంట్ కు టెస్ట్ చేయాలనే డిమాండ్ లు వెల్లువెత్తాయి. మొదట పరీక్ష చేయించుకోనని చెప్పిన ట్రంప్.. తర్వాత ఒత్తిడికి తలొగ్గారు. అయితే ట్రంప్ కు కరోనా లేదని తేలడంతో.. వైట్ హౌస్ ఊపిరి పీల్చుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కరోనా వైరస్ ఉందా..?లేదా..?అన్న అనుమానం వీడింది. వైద్య పరీక్షలు నెగిటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. 24 గంటల్లోపే ఫలితాలు వచ్చాయి. ట్రంప్ ఇటీవల బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోతో భేటీ అయ్యారు. అయితే ఫాబియోకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో ట్రంప్నకు వైరస్ సోకిందా..లేదా..అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. భేటీ జరిగి వారం గడుస్తున్నా ట్రంప్లో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. మరోవైపు బోల్సోనారోకు జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్ వచ్చింది.
బోల్సోనారో-ట్రంప్ మధ్య జరిగిన భేటీలో పాల్గొన్న అధికారుల్లో ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 7న ఫ్లోరిడాలోని ఓ రిసార్టులో వీరంతా కలిసి భోజనం చేశారు. అక్కడే ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోల్సోనారో, ట్రంప్ సైతం పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. మరికొంత మంది ఇంకా పరీక్ష ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.
అంతకుముందు ఐదు రోజుల అమెరికా టూర్ కు వచ్చి వెళ్లిన ఆస్ట్రేలియా హోం మంత్రికి కూడా కరోనా వచ్చింది. దీంతో ఆయన్ను కలిసిన ట్రంప్ కూతురు ఇవాంక తనకు తాను క్వారంటైన్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు.