రాజమండ్రి టీడీపీలో రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీకి..సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీకి ఏ మాత్రం పడని విషయం తెలిసిందే. అసలు రాజమండ్రి సిటీ సీటు బుచ్చయ్యది...కానీ 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వల్ల ఆ సీటు వదిలి రూరల్ రావాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో పొత్తు లేకపోయినా సరే సిటీ సీటు చంద్రబాబు, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చారు. దీంతో బుచ్చయ్య మళ్ళీ రూరల్‌లో పోటీ చేసి గెలిచారు.

అయితే ఆయనకు సిటీ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది..ఆ క్యాడర్‌ని ఆదిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై ఆ మధ్య బుచ్చయ్య రాజీనామా వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. చంద్రబాబు బుజ్జగించడంతో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో బుచ్చయ్య మళ్ళీ యాక్టివ్‌గా పనిచేసుకుంటున్నారు. అటు సిటీలో ఆదిరెడ్డి భ‌వానీ ఆమె భ‌ర్త శ్రీనివాస్  పనిచేసుకుంటున్నారు. 

ఇక అంతా సజావుగా సాగుతుందనుకునే సమయంలో భవాని భర్త శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. బుచ్చయ్యపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బుచ్చయ్యని టార్గెట్ చేశారు. తమ అధినాయకుడుని మంగళగిరి వెళ్లి కలుస్తారని, క్షేత్ర స్థాయిలో అదే నాయకుడిని అమ్మానా బూతులు తిడతారని, వీరా సీనియారిటీ కలిగిన నాయకులు... వారి లక్షణాలు ఇవేనా అంటూ వాసు ఫైర్ అయ్యారు. వారికి విలువంటూ ఉందా..? గెలుపోటములు సర్వ సాధారణమని,  అంత మాత్రాన దిగజారుడు వ్యవహారాలు చేయకూడదని, కాలమే అన్నింటికీ సరైన సమాధానం చెబుతుందని పోస్టు పెట్టారు.

అంటే ఇటీవలే బుచ్చయ్య...మంగళగిరి వచ్చి చంద్రబాబుని కలిశారు. ఇక ఈయన క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్తితి గురించి డైరక్ట్‌గానే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భవాని భర్త వాసు...ఇలా బుచ్చయ్యని టార్గెట్ చేసి విమర్శలు చేశారని తెలుస్తోంది. అయితే ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రచ్చకు చంద్రబాబు బ్రేక్ వేయాల్సిన అవసరముంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: