
పైకి చూస్తే విశాఖలో కూటమి బలంగా ఉన్నట్టే కనిపిస్తున్నా, అంతర్గతంగా నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తపై గతంలో టీడీపీ, జనసేన కలిసి తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆయనపై భూముల అక్రమాలు, అన్యాయ వ్యాపారాలు చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. అదే పారిశ్రామికవేత్తపై ఇప్పుడిప్పుడు టీడీపీ నేతలలోనే రెండు వర్గాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక వర్గం ఆయనకు మద్దతుగా నిలవగా, మరొక వర్గం మాత్రం కఠినంగా వ్యతిరేకిస్తోంది. ఈ విభేదాల వల్ల స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తత పెరుగుతుండగా, చంద్రబాబు దీనిని సీరియస్గా గమనించారు. ఈ విభేదాలు పార్టీ బలాన్ని దెబ్బతీయవచ్చని ఆయన భావించారని చెబుతున్నారు.
వైసీపీ నాయకులు మాత్రం ఈ మధ్యకాలంలో విశాఖలో పెద్దగా కనిపించడం లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు సైలెంట్గా ఉండటం గమనార్హం. కూటమిని ప్రత్యక్షంగా సవాలు చేసే పరిస్థితి కనిపించకపోవడం, విశాఖలో పాలకపక్షం బలంగా నిలిచేలా చేస్తోంది. అయినప్పటికీ, పార్టీ లోపల విభేదాలు పెరగడం చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే "అంతా బాగానే ఉందా?" అని ఆయన నేతలతో నేరుగా ప్రశ్నించారని సమాచారం. నాయకులు మాత్రం అన్ని నియంత్రణలోనే ఉన్నాయని చంద్రబాబుకు హామీ ఇచ్చినప్పటికీ, ఈ విభేదాలు భవిష్యత్లో ఎలా మారతాయన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి, విశాఖలో ప్రస్తుతం బయటకు కనిపించేది కూటమి ఆధిపత్యమే అయినప్పటికీ, లోపల మంటలు మసులుతున్నాయి. ఈ మంటలు పెద్ద అగ్నిగా మారకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ముందుగానే ఆరా తీశారని చెప్పొచ్చు.