హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒక అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు అది కూడా అన్నదమ్ములు ఒకేసారి వివాహం చేసుకున్నారు. అదేంటి అంటే అది మా ఆచారం అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని షిల్లాయ్ గ్రామంలో హట్టీ తెగకు చెందిన ప్రదీప్ నేగి , కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు క‌లిసి సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను పెళ్లాడారు.


బహుభర్తృత్వం యొక్క అనాగరిక సంప్రదాయం కింద ఈ వివాహం జ‌రిగింది. మహిళలు ఎవరు వితంతువులుగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో హట్టీ తేగ‌లోని పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ట్రాన్స్ గిరి మరియు సిర్మౌర్ ప్రాంతంలో ఈ రకమైన ఆచారం వందల ఏళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. ట్రాన్స్ గిరిలోని బధానా గ్రామంలో గత ఆరేళ్ల‌లో అలాంటి ఐదు వివాహాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ చట్టాలు ఈ సంప్రదాయాన్ని గుర్తించి దానికి `జోడిదారా` అని పేరు కూడా పెట్టాయి.


ఇక‌ షిల్లాయ్ కు చెందిన ప్రదీప్ ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తుండగా, అతని తమ్ముడు కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ అన్న‌ద‌మ్ములు పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం త‌మ ఆచారాల‌ను మ‌ర్చిపోలేదు. ఇద్ద‌రు క‌లిసి సునీతా చౌహాన్ ను పెళ్లి చేసుకున్నారు. ట్రాన్స్-గిరి ప్రాంతంలో జూలై 12న ప్రారంభమై మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక‌లు ఎంతో ఘ‌నంగా జ‌రిగాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ వివాహం త‌న పూర్తి సమ్మతితోనే జరగిందని, ఎటువంటి ఒత్తిడి లేద‌ని వ‌ధువు సునీతా చౌహాన్ పేర్కొన్నారు. దీంతో ఈ పెళ్లి వేడుక సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో.. ఇదెక్క‌డి వింత ఆచారం రా బాబు అంటూ నెటిజ‌న్లు త‌ల‌పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: