ఇటీవలె శీతాకాలం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. మునుపెన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తెలంగాణ ప్రజానీకం మొత్తం వర్షాల ధాటికి వణికిపోయింది. రాష్ట్రం మొత్తం చిగురుటాకులా వనికి పోవడమే  కాదు భారీగా నష్టం కూడా వాటిల్లింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పంటలు బాగా పండాయని  సంతోషపడుతున్న రైతన్నలకు అకాల వర్షాలు మళ్ళీ దిగ్భ్రాంతిని మిగిల్చింది అనడంలో అతిశయోక్తి లేదు.



 దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది. దీంతో రైతన్నలు అందరూ దిగాలుగా ఉన్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. మరోవైపు కేసీఆర్ సూచించిన విధంగా పంట వేసినందుకు సరైన దిగుబడి రాక నష్టాల్లో కూరుకు పోతున్నారు మరికొంతమంది రైతులు. దీంతో తమను ఆదుకోవాలని అంటూ దీనంగా ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో చేతికి వచ్చిన పంట నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు.



 అయితే భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది లేదా అన్నది కూడా రైతులు అందరిని ప్రస్తుతం అయోమయంలో పడేస్తోంది.  కేంద్రం ఇచ్చే పంట బీమా పథకాలెవీ   రాష్ట్రంలో అమలు కాకపోవడం... పంట పరిహారం గురించి కేసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో  ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.  దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో చేతికొచ్చిన పంట దెబ్బతినగా..  ఈ పంట విలువ దాదాపుగా 8633 కోట్ల విలువ ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఒక్కో రైతుకు ఎంత నష్టం వచ్చింది అన్న దానిపై మాత్రం సమీకరించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: