వరుస లాభాల అనంతరం బుధవారం నష్టాలను నమోదు చేసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం మునుపటి జోరునే కొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామలకు తోడు.. దేశ ఆర్థిక వృద్ధికి కేంద్రం చర్యలు కొనసాగించడం మార్కెట్లకు కలిసి వచ్చింది. దీంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం మార్కెట్లు 123 పాయింట్లతో లాభాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్ చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. అదే జోరుతో కొనసాగిన మార్కెట్లు మిడ్ సెషన్ సమయానికి మరింత దూకుడును పెంచాయి.
విదేశీ మార్కెట్ల సానుకూలత, గత వారం నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్ పరిణామాలు మార్కెట్లకు కలిసొచ్చాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్ల లాభాలు ఒకరోజు విరామంతో మళ్లీ అదే జోరును అందుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 409 పాయింట్లు లాభపడి 36,737 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 10,813 వద్ద స్థిర పడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.03గా ఉంది. సెన్సెక్స్ ఇండెక్స్లో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టాటాస్టీల్ హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్, హెచ్సీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఓఎన్జీసీ, టెక్ మహీంద్రా, మారుతీ, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్ఫార్మా షేర్లు నష్టాలను నమోదు చేశాయి.
గురువారం ఉదయం నుంచి మరింత ఎగిసిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను అధిగమించి ట్రేడ్ అయ్యాయి. మార్కెట్ ఆరంభమైన కొద్ది వ్యవధిలోనే నిఫ్టీ 104 పాయింట్లు ఎగిసి 10810 వద్ద, సెన్సెక్స్ 404 పాయింట్ల లాభంతో 36730 వద్ద ట్రేడయ్యాయి. మొత్తంగా మెటల్, బ్యాంకింగ్ షేర్లు భారీగా లాభపడటం కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ ఇదే జోరుతో ఉంది. అయితే ఎఫ్అండ్ఓ వీక్లీ ఎక్స్పైరీ కారణంగా ఎనలిస్టులు అప్రమత్తతను సూచిస్తున్నారు. హీరోమోటో కార్ప్, మారుతి సుజుకీ, యూపీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, టైటాన్ టాప్ లూజర్స్గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో 3 పైసలు ఎగిసిన రూపాయి 74.99 వద్ద ముగిసింది.