బంగారం రేటు తగ్గుతుండటంతో.. దానిపై పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బంగారు బిస్కెట్లతోపాటు, నగలు చేయించుకోడానికి కూడా చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే బంగారం కొనుగోలుకి ఇది అంత మంచి సమయం కాదని, మరికొంతకాలం వాయిదా వేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. బంగారం ధర మరింత తగ్గేవరకు వేచి చూడాలని చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లో పసిడి ధర రోజు రోజుకీ దిగొస్తోంది. బుధవారం ఒక్క రోజే రూ. 717 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 46,102కి పడిపోయింది. ముందురోజు ట్రేడింగ్‌లో ఈ ధర రూ. 46,819గా ఉంది. ఇక వెండి కూడా పసిడి దారిలోనే నేల చూపులు చూస్తోంది. ఒక్కరోజులోనే రూ. 1,274 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 68,239 పలికింది.
అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి గిరాకీ లేకపోవడంతో దేశీయంగా ఈ లోహాల ధరలు పడిపోయినట్లు నిపుణులు తెలుపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,786 డాలర్లు, ఔన్సు వెండి ధర 27.10 డాలర్లుగా ఉంది. పసిడిపై కస్టమ్స్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి దేశంలో బంగారం ధర కాస్త తగ్గుతూ వస్తోంది.

బంగారం ఇప్పుడే కొనాలా..? వాయిదా వేయాలా..?
ధర తగ్గడం సంతోషకరమైన విషయమే అయినా ఇప్పుడప్పుడే బంగారం కొనొద్దని సూచిస్తున్నారు నిపుణులు. మరింతగా ధర తగ్గే అవకాశం ఉందని, కొన్నిరోజులు వేచి చూడాలని అంటున్నారు. సిప్ విధానంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మాత్రం మహూర్తాలు అక్కర్లేదని, ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టొచ్చని చెబుతున్నారు.

కరోనా కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన వేళ.. అందరూ బంగారంలో పెట్టుబడులు మొదలు పెట్టారు. ఆ తర్వాత షేర్ మార్కెట్లు పుంజుకోవడంతో.. ప్రస్తుతం వాటిపై మళ్లీ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బంగారంలో పెట్టుబడులు తగ్గుతున్నాయని, అందుకే రటు తగ్గుతోందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: