ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి విజయనగరం జిల్లా అనేది కంచుకోట. అయితే బలమైన క్యాడర్ ఉన్న ఈ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక తరువాత టీడీపీ గందరగోళంలో పడింది. ప్రస్తుతం జిల్లాలోని గజపతినగరం, ఎస్ కోట, చీపురుపల్లి ఇంకా నెల్లిమర్లలో క్యాడర్ గ్రూపులుగా విడిపోయింది. వీటిలో గజపతినగరం నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడుని పక్కనపెట్టి కొత్తగా కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కట్టబెట్టింది టీడీపీ.అందువల్ల ఈ నియోజకవర్గంలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. కెఏ నాయుడు తన కార్యకర్తలతో ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి శ్రీనివాసరావుకు సహకరించేది లేదని తేల్చి చెప్పారట. అప్పటి నుంచి అభ్యర్థికి సహకరించకుండా ఎప్పటికప్పుడు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కే ఏ నాయుడు అనుచరులు.


మరో నియోజకవర్గం ఎస్ కోటలో గత రెండేళ్లుగా ఎన్ ఆర్ ఐ గొంప కృష్ణ తనకే టిక్కెట్ దక్కుతుందని ఆశలతో ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేపట్టి విస్తృతంగా పర్యటించారు. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ప్రస్తుత ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికే టిక్కెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన గొంప కృష్ణ కార్యకర్తలతో సమావేశమై టిక్కెట్ విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేశారు. తన పార్టీ ఆఫీస్ పై ఉన్న పార్టీ గుర్తులు, జెండాలు తొలగించి నిరసన తెలిపారు. లోకేష్, చంద్రబాబులు తనను మోసం చేశారని హాట్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో కోళ్ల లలిత కుమారి వర్గం ఓ వైపు, గొంప కృష్ణ వర్గం మరోవైపు ఉన్నారు.


మరో కీలక నియోజకవర్గం చీపురుపల్లిలో ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇంచార్జిగా ఉన్నారు. అయితే నాగార్జునను పక్కనపెట్టి మరొక కొత్త వ్యక్తికి టిక్కెట్ కేటాయించాలని ప్లాన్ చేస్తుంది టీడీపీ అధిష్టానం. ఇక్కడ నుండి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావు పేర్లతో సర్వే కూడా నిర్వహించి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి బరిలో దిగుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన నాగార్జున పార్టీ కార్యక్రమాల పట్ల కోపంగా ఉన్నారు. ఇక్కడ కొత్త అభ్యర్థికి టిక్కెట్ కేటాయిస్తే కిమిడి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.పొత్తులో భాగంగా నెల్లిమర్ల స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించింది టీడీపీ. ఇక్కడ జనసేన తరపున లోకం నాగమాధవి పోటీ చేస్తుండగా, టీడీపీ నుండి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కర్రోతు బంగార్రాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు.


 పొత్తులో నెల్లిమర్లకు టిక్కెట్ కేటాయించారు కాబట్టి మరో చోట ఎక్కడ నుండైనా సరే తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నాడు. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తన రాజకీయ భవిష్యత్ ఏంటి అన్న అంశంపై కంగారు పడుతున్నాడు. ఇక్కడ జనసేనకు కూడా టీడీపీ శ్రేణులు  సహకరించట్లేదన్న విమర్శలు ఉన్నాయి.ఇలా జిల్లాలో ఉన్న తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో క్యాడర్ గ్రూపులుగా మారి గందరగోళంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో మరోసారి టీడీపీ ఓడిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: