
ఒకప్పుడు బలమైన ఆధిపత్యం చూపిన టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు వైసీపీ ప్రచారం ముందు వెనకబడిందని బాబు భావిస్తున్నారు. రోజుకు 18 గంటలు పని చేసే చంద్రబాబు, కొన్నిసార్లు 20 గంటల వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, గత ఆరు నెలలుగా వైసీపీ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఎక్కువ సమయం వేస్ట్ అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా రైతుల సమస్యలు, అమరావతి రాజధానిలోని సమస్యలు, కేంద్రం నుంచి సహాయం లభించకపోవడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి అంశాలను వైసీపీ సోషల్ మీడియా బలంగా చర్చిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా కౌంటర్ వాదనలు సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తోందని ఆయన చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి స్పందిస్తే తనకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మరింత సమయం కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టంగా సూచించారు. ఇకపై ఎవరు ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎలాంటి అంశాలపై మీడియా ముందుకు వస్తున్నారు అన్నదానిపై నివేదికలు తీసుకుంటానని జిల్లా నాయకులకు తెలిపారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలకు సోషల్ మీడియాలో వైసీపీని ఎదుర్కోవడం, బలమైన వాదనలు వినిపించడం తప్పనిసరిగా మారింది. కేవలం హాజరై కొద్ది మాటలు చెప్పి వెళ్లిపోవడం కుదరదు అని.. పార్టీ తరపున వైసీపీకి గట్టిగా కౌంటర్లు ఇవ్వాల్సిందే అని బాబు చెపుతున్నారు.