తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. త్వరలోనే ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుందని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రంగంలోకి దిగి బాధ్యతలు తీసుకుంటున్నారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపుతుందా లేదా మరొకరికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి.


కేటీఆర్ మాత్రం ఈ ఉప ఎన్నిక‌ను దగ్గరుండి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఉపఎన్నికపై ఫోకస్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు జారీచేసి డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. బిజెపి మాత్రం ఈ ఉప ఎన్నిక‌పై పెద్దగా దృష్టి సారించినట్టు కనిపించడం లేదు. అయితే కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థిని పోటీ పెడుతుంది అనటంలో సందేహం లేదు.


అయితే ఇక్కడ మజ్లిస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. మజ్లిస్‌ ఎవరికి సపోర్ట్ చేస్తుంది లేదా తమ పార్టీ అభ్యర్థిని పోటీ పెడుతుందా అన్నది కూడా చూడాలి. ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్ - కాంగ్రెస్ - బిజెపిలకు ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పాలి. ఈ సిట్టింగ్ సీటు నిలుపుకోవడం బిఆర్ఎస్ కు చాలా కీలకం. 2023 అసెంబ్లీ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలలో గెలిచిన బీఆర్ఎస్ తర్వాత ఉప ఎన్నిక‌ల్లో తమ సిట్టింగ్ సీటు కోల్పోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకోవటం ఆ పార్టీకి అత్యంత కీలకమని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: