
ఇక బెట్టింగ్ రాయుళ్లయితే ముందు అక్రమ మద్యం కేసు తేలిన తర్వాతే నకిలీ మద్యం కేసులు తేలుస్తారని బెట్టింగులు కట్టేందుకు సిద్ధపడుతున్నట్టు సోషల్ మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. అక్రమ మద్యం కేసు వైసిపి హయాంలో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో 49 మందికి పైగా నిందితులు ఉన్నారని కేసులు నమోదు చేశారు. వీరిలో 49వ నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించి మద్యంతర బెయిల్ తెచ్చుకున్నారు.
ఇక 48వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు. నాలుగో నిందితుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవలే రెగ్యులర్ బెయిల్ సంపాదించుకున్నారు. ఈ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజ్ శేఖర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు. దీనికి తోడు దాదాపు 9 మాసాలుగా ఈ కేసు విచారణ జరుగుతున్నా... ఇంత వరకు బలమైన ఆధారాలను సమర్పించలేదన్నది ఇటీవల కోర్టు చేసిన వ్యాఖ్య. మరో వైపు ఇంకా నిందితులు ఉన్నారని, వారిని విచారించాలని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే మరోవైపు తాజాగా నకిలీ మద్యం కేసు తెర మీదకు వచ్చింది.
ఇది టిడిపి హయాంలో వెలుగు చూసిన వ్యవహారం. పైగా, టిడిపి సొంత నేత జయ చంద్రారెడ్డి ఇందులో ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. జైలుకు కూడా తరలించారు. ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్రావును కూడా అరెస్ట్ చేశారు. జైలుకు తరలించారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. వీరిలో కొందరు విదేశాలకు పారిపోయారని పోలీసులు చెబుతున్నా రు.
ఈ నేపథ్యంలో అటు అక్రమ వైద్యం కేసు ముందు తేలుతుందా? ఇటు నకిలీ మద్యం కేసు ముందు తేలుతుందా? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం గమనార్హం. అదే సమయంలో అటు వైసిపి పైన ఇటు టిడిపి పైన కూడా ఈ వ్యవహారం ట్రెండింగ్ లో ఉండడం మరో విశేషం. మరి చివరకు ఏం జరుగుతుందనేది చూడాలి.