సీనియర్ నేతలే పార్టీ కొంపముంచేసినట్లున్నారు విజయవాడలో. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో తెలుగుదేశంపార్టీ ఓడిపోయింది. ఆలూలేదు చూలులేదు అల్లుడిపేరు సోమలింగం అన్న సామెతలాగ తయారైపోయింది టీడీపీ యవ్వారం. గెలుస్తుందో లేదో తెలీకుండానే విజయవాడ మేయర్ అభ్యర్ధి ఎవరు ? ఎవరిని మేయర్ గా ప్రకటించాలి ? అనే విషయాలపై టీడీపీ నేతల మధ్య చాలా సీరియస్ గా గొడవలైపోయాయి.  ఇదే విషయమై ఒకవైపు ఎంపి కేశినేని నాని మరోవైపు ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, అధికారప్రతినిధి నాగూల్ మీరా మధ్య వివాదం మొదలైంది. తర్వాత అది గాలివానలాగ తయారై చివరకు మీడియా ముందే ఎంపిని నేతలు నోటికొచ్చినట్లు తిట్టేశారు.



చివరకు నేతల మధ్య గొడవలు కాస్త సామాజికవర్గాల మధ్య గొడవలుగా తయారైంది. బోండా ఏమో కాపు సామాజికవర్గం నేత అయితే ఎంపి కమ్మ సామాజికవర్గం నేత. అయితే బోండాకు బుద్ధా, నాగూల్ అండగా నిలవటంతో పార్టీలో గొడవ తారాస్ధాయికి చేరుకుంది. చివరకు ఆ గొడవలు పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధుల గెలుపుపై పడింది. అభ్యర్ధుల తరపున ప్రచారం చేసిన చంద్రబాబుతో కలిసి పనిచేయటానికి కూడా పై ముగ్గురు నేతలు ఇష్టపడలేదు. దాంతో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు బయటపడ్డాయి. చివరకు నేతల మధ్య పెరిగిపోయిన గొడవలే పార్టీ పుట్టిముంచాయి.



అసలు గెలుపు అవకాశాలు లేని విజయవాడ కార్పొరేషన్లో ఏకంగా మేయర్ అభ్యర్ధి ఎంపిక అంశంతోనే పార్టీలో ముసలం పుట్టింది. ఎంపి కూతురు కేశినేని నాని కూతురు శ్వేతను చంద్రబాబు ప్రకటించటాన్ని జీర్ణించుకోలేని నేతలు పార్టీ అభ్యర్ధుల విజయానికి పెద్దగా కృషి చేయలేదు. మేయర్ అభ్యర్ధి అంశాన్ని పక్కనపెట్టేసి అందరు కలిసికట్టుగా గెలుపు కోసం పనిచేసుంటే మరో నాలుగు డివిజన్లలో గెలిచేదేమో. గెలుపు అవకాశాలను చేజేతులారా పోగొట్టుకున్న టీడీపీ నేతలు ఇపుడు తీరిగ్గా బాధపడుతున్నారు. మొత్తంమీద టీడీపీ నేతలే పార్టీ కొంపముంచేసిన విషయం స్పష్టంగా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: