ధవళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని జనసేన అధ్యక్షులు.. నటుడు పవన్ కళ్యాన్  మాట్లాడుతూ..  సర్ ఆర్థర్ కాటన్ నిస్వార్థ ప్రజాసేవకుని స్మృతికి నివాళి అర్పిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. కాటన్ జయంతి సందర్భంగా తన తరపున, జనసైనికుల తరపున మన:పూర్వక అంజలి ఘటిస్తున్నానని అన్నారు. గోదావరి పుణ్య స్నానం ఆచరించేటప్పుడు కాటన్ ను స్మరిస్తూ నేటికీ అర్ఘ్యం సమర్పిస్తున్నారంటే ప్రజలు ఆయనకు అర్పించే కృతజ్ఞతాపూర్వక నివాళి అది అని కొనియాడారు.  కేవలం, గోదావరి ప్రాంతంలోనే కాకుండా కృష్ణా తీరం, తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన చేసిన కృషిని ఎవరూ మరచిపోలేరని అన్నారు. 

 


ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని కాపాడటంతోపాటు తాగు నీటిని అందించాలంటే కావాల్సింది ప్రజల పట్ల బాధ్యత అని కాటన్ జీవితాన్ని చదివితే అర్థమవుతుందని అన్నార . ఇరిగేషన్ ప్రాజెక్టులను ఓట్లు కురిపించే సాధనాలుగా భావించే నేటితరం పాలకులు.. అపర భగీరథుడు కాటన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పడ్డ తపన గురించి తెలుసుకోవాలని సూచించారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తేనే ప్రాజెక్టులు కాగితాలపై కాకుండా కార్యరూపం దాల్చి నిర్మాణాలు పూర్తవుతాయన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: