జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కొత్త చర్చకు తెరలేపారు.. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీల్చబోనీయనని గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో స్పష్టం చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలో దిగే ప్రసక్తే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సీటు సాధించింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం చెందారు.


గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన.. ఇలా త్రిముఖ పోరు జరిగింది. అందులో వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకోవడం వల్ల అంతిమంగా వైసీపీకి మేలు జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి ఏకంగా రెండేళ్ల ముందుగానే పొత్తు ప్రకటన చేశారు. ఇలా చేయడం వల్ల ఆ పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉందని తేలిపోయింది. అయితే.. జనసేన ఒక్కటే కాకుండా బీజేపీతో కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది.


సో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. అయితే.. ఇక్కడ ఓ కీలక ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకం అంత సులభంగా జరుగుతుందా.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది. సగం సగం సీట్లు పంచుకునే అవకాశం ఎలాగూ ఉండదు.. కచ్చితంగా జనసేనకు మహా అయితే ఓ 50 సీట్లు ఇస్తే ఇవ్వొచ్చు. మరి అంత తక్కువ సీట్లతో జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందా?


వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే గెలిచిందనుకుందాం.. అప్పుడు ఆటోమేటిగ్గా సీఎం చంద్రబాబే అవుతారు కదా.. మహా అయితే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇవ్వొచ్చు. మరి ఆ మాత్రం దానికి పవన్‌.. జనసేన ప్రభుత్వం రాబోతోందని ఎలా చెబుతున్నారు.. ఇదే ఇప్పుడు జనసైనికులను తొలుస్తున్న అనుమానం. చూడాలి ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: