గత ఏడాది యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాతో ఆశించిన రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయిన బాహుబలి ప్రభాస్, ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మించడం జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు తో పాటు బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సగం పూర్తి అయినట్లు చెప్తున్నారు. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రిట్రో ప్రేమకథగా మంచి యాక్షన్, ఎమోషనల్ అంశాల మేళవింపుగా దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

ప్రభాస్ ఈ సినిమాలో రొమాంటిక్ లవర్ గా కనపడనున్నాడని, అలానే సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ అదిరిపోతాయని అంటున్నారు. నిజానికి ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ మొన్నటి ఉగాది పండుగ నాడు రిలీజ్ చేయవలసి ఉంది. అయితే అదే సమయంలో జార్జియాలో యూనిట్ షూటింగ్ చేస్తుండగా కరోనా ఒక్కసారిగా తన కోరలు విప్పడంతో షూటింగ్ ని అర్ధంతరంగా ముగించి యూనిట్ సభ్యులు ఇండియాకి చేరుకున్నారు. దానితో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ అనుకున్న విధంగా రిలీజ్ చేయలేకపోయినట్లు ఇటీవల యువి క్రియేషన్స్ నిర్మాతలు వివరణ ఇవ్వడం జరిగింది. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

ప్రభాస్ అదిరిపోయే పోస్టర్ తో పాటు సినిమా టైటిల్ కు సంబంధించి అప్పుడే సినిమా యూనిట్ కొంత హోమ్ వర్క్ చేస్తోందని, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పకుండా డార్లింగ్ ఫ్యాన్స్ కు నచ్చుతుందని వారు అంటున్నారు. కాగా ఈ సినిమాకు ఓ డియర్ అనే టైటిల్ నిర్ణయించినట్లు కొద్దిరోజులుగా ఒక వార్త ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. మరి నేడు అందుతున్న సమాచారాన్ని బట్టి మే మొదటివారంలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: