రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వ్యాఖ్యానించారు. #JSPForAP_Roads అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా రెండున్నర కోట్ల మందికి మన రోడ్ల దుస్థితి చేరిందని పవన్ తెలిపారు. ట్విట్టర్ లో 6.2 లక్షలకుపైగా రోడ్ల పై ట్వీట్లు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అద్వానమైన పరిస్థితిని ప్రజలు, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ ఈ  హ్యాష్ ట్యాగ్ తో మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని పవన్ స్పష్టం చేశారు. లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాంతాల్లోని రోడ్లు ఏ విధంగా పాడైపోయాయో వివరించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూల నుండి రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ శనివారం మధ్యాహ్నంకు దాదాపు 6 లక్షల 20 వేల ట్వీట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లగలిగామంటూ జనసేన అధినేత చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో రోడ్లు ఛిద్రమైపోయినట్టు పవన్ తెలిపారు. 

సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు మరియు వీడియోలు చూశానని...కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో రోడ్లు...విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో రోడ్లు...అదే విధంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో రోడ్లు ఎంత అద్వానంగా ఉన్నాయో ఫోటోలతో సహా పోస్టులు చేశారని పవన్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంలో అయితే పెద్ద పెద్ద గుంతలతో నీళ్లు నిండి పైరు వేసుకునేలా రోడ్లు తయారయ్యాయాంటూ పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ జిల్లాలోనే ఈ రోజూ ఏజెన్సీ ప్రాంతంలో గోకవరం నుంచి గుర్తేడు-పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సుకి గుంతలు కారణంగా రన్నింగ్ లోనే వెనక చక్రాలు ఊడిపోయాయని పవన్ చెప్పారు.

నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో గజానికో గొయ్యి కనిపిస్తోందని పవన్ ఆరోపించారు.  ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని... పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు రహదారి పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పవన్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో రహదారులు నరకకూపంలా మారాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. కనీసం సొంత జిల్లాలో అయినా రోడ్లకు మరమ్మతులు చేయించలేకపోయారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పేరును అవమానించేలా జిల్లాలో రోడ్ల పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు. తిరుపతి ప్రాంతంలో రహదారులు పాడైపోయి ఉన్నాయని....ఆ మరమ్మతులకు నిధుల కోసం పార్టీ శ్రేణులు భిక్షాటన చేసి తమ నిరసన తెలిపాలని జనసేన అధినేత పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని పవన్ ఆరోపించారు. అడుగుకో గుంత ... గజానికో గొయ్యిలా రహదారులు తయారై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని పవన్ మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి పాడైన రోడ్లకు వెంటనే మరమ్మతులు ప్రారంభించి ప్రజల ప్రాణాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. రోడ్ల దుస్థితిని ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేద్దామని ఒకే ఒక్క పిలుపుతో స్పందించిన సైనికులకు, వీర మహిళలకు మరియు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: