ఏదేమైనా విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తన పట్టును నిరూపించుకున్నారు. 2019 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి ముగ్గురు మాత్రమే ఎంపీలుగా విజయం సాధించారు. గుంటూరు నుంచి గల్లా జయదేవ్ - శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు - విజయవాడ నుంచి కేశినేని నాని మాత్రమే వరుసగా మూడోసారి విజయం సాధించారు. విజయవాడ ఎంపీ విషయానికి వస్తే ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడుగురు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆరుగురు చిత్తుగా ఓడిపోయారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ మాత్రమే రెండోసారి గెలిచారు. తన పార్లమెంట్ పరిధిలో ఆరుగురు పార్టీ అభ్యర్థులు ఓడిపోయినా కూడా నానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆయన ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. ఈ గెలుపులో నాని వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా పార్టీలో తన అసమ్మతి గ‌ళాన్ని వినిపించిన నాని... ఇప్పుడు తన పట్టును నిరూపించుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపీ నానిని చంద్రబాబు నియమించారు.

వాస్తవానికి ఈ సీటుపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తో పాటు పార్టీ అధికార ప్రతినిధి షేక్ నాగుల్ మీరా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారిద్దరిని కాదని నాని సమన్వయకర్తగా నాని నియమించడం తో నాని వర్గం సంబరపడిపోతోంది. ఇక గత కార్పొరేషన్ ఎన్నికల్లో నాని కుమార్తె కేశినేని శ్వేతను టిడీపి మేయర్ అభ్యర్ధిగా ప్రకటించ‌డం... ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త గా నాని ఉండటం తో వచ్చే ఎన్నికల్లో నాని విజయవాడ ఎంపీగా ... ఆయన కుమార్తె శ్వేత విజయవాడ పశ్చిమ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

విచిత్రమేంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1983లో మాత్రమే టీడీపీ గెలిచింది. అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ జెండా ఎగర లేదు. మరి నాని అక్కడ పార్టీని బలోపేతం చేస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: