టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా కుటుంబంపై వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత దళిత న్యాయవాది సుబ్బారాయుడునీ టీడీపీ నాయకుడే హత్య చేశాడని ఆయన ఆరోపించడం తో రాజకీయ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. సుబ్బారాయుడును హత్యచేసిన వ్యక్తి భూమా కుటుంబంతో ఫొటోలు మాత్రమే దిగలేదని..వారితో అక్రమ వ్యాపారాలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హత్య రాజకీయాలతో భయపెడితే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరని బల్లగుద్ది చెప్పారు.. నంద్యాలలో భయం సృష్టించాలని చూస్తే ఎవరూ ఊరికే చూస్తూ ఉండరని సవాల్ విసిరారు.
అంతేకాదు ఈ హత్య వెనుక ఉన్న దగాకోరులు ఎవరినైనా సరే... వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు శిల్పా రవి. అసలు నిజానికి భూమా కుటుంబం వల్లే ఆళ్లగడ్డ అభివృద్ధి చెందలేదని.. 2014 నుంచి భూమా కుటుంబం తమ నాయకులపై అనేక దాడులు హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే శిల్పా రవి కుండ బద్దలు కొట్టినట్టు విషయాన్ని అందరి ముందు వివరించారు. మరోవైపు టీడీపీ నేత మాజీ మంత్రి అఖిలప్రియ ఈ ఆరోపణలు వ్యతిరేకిస్తూ....దమ్ముంటే వారం రోజుల లోపల ఈ ఆరోపణను నిరూపించాలని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పు కుంటానని చెప్పారు. కానీ నిరూపించని పక్షంలో తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిదని... మాటతూలే ముందు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని పెదవి విప్పితే సమస్య ఉండదని అఖిలప్రియ శిల్ప రవిని హెచ్చరించారు.