జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది. ఏడో విడతగా అన్ని రాష్ట్రాలకు కలిపి 6 వేల కోట్ల రుణాలు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు 125 కోట్ల రూపాయలు,  తెలంగాణకు 129 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి.

జీఎస్టీ పరిహారం విడుదల చేసింది కేంద్రం. 23 రాష్ట్రాలకు 5 వేల 516 కోట్లు.., కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరికి  483 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది.  అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మిజోరాం, సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాలు ఆదాయాలు కోల్పోకపోవడంతో వాటికి పరిహారం విడుదల చేయలేదని తెలిపింది. తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటి వరకు  42వేల కోట్లు రాష్ట్రాలకు కేంద్రం రుణాలుగా ఇచ్చింది.

ఇక ఏపీకి ఏడో విడత కింద  125 కోట్ల రూపాయలు  పరిహారం విడుదలైంది. దీంతో ఇప్పటివరకూ తెలంగాణకు మొత్తం 1055 కోట్ల రూపాయలు అందాయి.  అటు తెలంగాణకు ఏడో విడతగా 129 కోట్ల రూపాయలు విడుదల కాగా.,  ఏడు విడతలుగా మొత్తం తెలంగాణకు  559 కోట్ల రూపాయలు సమకూరాయి.

జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుమారు లక్షా పది వేల  కోట్లు లోటు ఏర్పడినట్లు అంచనా వేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారానికి బదులు రుణాలు తీసుకునేందుకు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు రుణాలు మంజూరు చేస్తోంది.

వస్తు-సేవల పన్ను పరిహారం చెల్లింపు కోసం కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన ఆప్షన్‌-1 పరిధిలోకి  దాదాపు అన్ని రాష్ట్రాలూ చేరిపోయాయి.  ఇందులో చేరిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు  లక్షా ఐదు వేల కోట్ల అదనపు రుణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు  5 వేల 51 కోట్లు, తెలంగాణకు 5 వేల 17 కోట్ల మేర అదనపు రుణం తీసుకొనే వెసులు బాటు వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: