ప్రతి నెలా ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇచ్చే పింఛన్లు వచ్చే నెలలో ఆలస్యం చేయనున్నారు. ఏప్రిల్‌ నెలలో పింఛన్ల పంపిణీ 1 వ తేదీన కాకుండా 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.మార్చి నెలతో ముగుస్తోన్న ఆర్థిక సంవత్సరంతో పాటు వరుస బ్యాంకు సెలవుల వల్ల ఫింఛన్లు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్‌ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు వల్ల దేశవ్యాప్తంగా కూడా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో సచివాలయాల సిబ్బంది పింఛను నగదును ఏప్రిల్‌ 2 వ తేదీన డ్రా చేసుకుని, మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సమాచారాన్ని అందించారు. కాగా గత సంవత్సరం కూడా ఏప్రిల్‌ నెలలో 3వ తేదీ నుంచి ఈ పింఛన్లను ఇచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ గ్రామ వాలంటీర్ల ద్వారా యధావిధిగా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్‌ ని అందిస్తామని అధికారులు తెలిపారు.


అయితే ఎన్నికల కోడ్‌తో అమల్లో ఉండటంతో సెర్ప్‌ ప్రత్యేక మార్గదర్శకాలను బుధవారం నాడు అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు ఇంకా మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిర్దేశిత పరిమితికి మించి నగదు తీసుకువెళ్లకూడదనే ఆంక్షలు కూడా ఉన్నాయి. అయితే లావాదేవీలకు సంబంధించిన రశీదులని చూపించి తీసుకెళ్లవచ్చు. దీంతో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది ఇంకా వాలంటీర్లు బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత బ్యాంకు సిబ్బంది ఇచ్చే రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని, పోలీసుల తనిఖీల్లో వాటిని చూపించాలని సెర్ప్‌ అధికారులు సూచించడం జరిగింది.పింఛన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్‌ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు సంబంధిత సిబ్బంది తమ దగ్గరే ఉంచుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: