ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒక పార్టీపై మరొక పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నామినేషన్లు ముగిశాయి. ఈ తరుణంలో కూడా ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలా అని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి. తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ ఏర్పడింది. వైసీపీ నేతల ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం ఏకీభవిస్తే ఖచ్చితంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారిపై లిఖిత పూర్వకంగా ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. అక్కడ నుంచి వచ్చే సూచనల కోసం, ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ ప్రసంగాలపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. విడిగా పోటీ చేసే కంటే కూటమిగా పోటీ చేస్తే విజయావకాశాలు పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. గతంలో సైతం ఇలా కూటమి కట్టడంతో విజయం సాధించిన అనుభవం ఉంది. కూటమి కట్టకుండా ఉండడానికి వైసీపీ నేతలు పలు విమర్శలు చేశారు. సీట్లు తగ్గించుకుని పవన్ మూడు పార్టీల కూటమికి బాటలు వేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తన కుటుంబం గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్‌కు అదే రీతిలో గట్టిగా బదులిస్తున్నారు. బాబాయి హత్యకు పాల్పడింది ఎవరో చెప్పాలని నిలదీస్తున్నారు. చంద్రబాబుతో కలిసి పవన్ ఈ నెల ఈ నెల 24, 25 తేదీల్లో కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జగన్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న వైఎస్ వివేకా హత్య అంశాన్ని జగన్‌కు ఆపాదించి, రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారని వివరించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: