ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కబోతోంది. కూటమి ప్రభుత్వం వైసీపీని పూర్తి స్థాయిలో రోడ్డున పడేయాలని పథకం వేసుకుంటోంది. ఇప్పటివరకు ఆ పార్టీ క్యాడర్ ఆనందిస్తున్న చిన్నా, పెద్దా పదవులన్నింటినీ ఊడగొట్టేందుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వైసీపీకి దెబ్బపై దెబ్బ తగలబోతోంది. ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టారు. ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లన్నీ డిసెంబర్ లోపు పూర్తి చేయనున్నారు. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, పంచాయతీ, పరిషత్ ఎన్నికలను ముందుగా, తర్వాత మున్సిపల్ ఎన్నికలను జరపనున్నారు. చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల ముందుగానే నిర్వహించే వీలుంది.
 

ఆ అవకాశాన్ని ఈసారి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఎందుకు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అసలు వైసీపీ ఈ మధ్య పులివెందులలో ఘోర పరాజయం చవిచూసింది. కేడర్ ధైర్యం కోల్పోయింది. ఏకంగా బలమైన క‌డ‌ప‌లోనే ఓటమి అంటే ఆ పార్టీ మానసికంగా చిత్తుగా మారిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి వైసీపీ ఎక్కడా పోటీ చేయకపోవడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికలు సహా అన్ని చోట్ల బహిష్కరణకే ప్రాధాన్యం ఇస్తూ, "అధికార దుర్వినియోగం జరుగుతోంది" అంటూ తప్పించుకుంటోంది. కానీ ఇక్కడే అసలు చిక్కు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ సీటు సీటుగా ఉంటాయి. కూటమి ప్రభుత్వం కూడా క్యాడర్‌కు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా, ప్రజలలో తమ బలాన్ని ప్రదర్శించేలా ముందుగానే ఈ ఎన్నికలను జరపాలని ఫిక్స్ అయింది.

 

ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోతే "బలహీనతే కారణం" అనే ట్యాగ్ పడుతుంది. పోటీ చేస్తే మరింత పరాభవం తప్పదన్న భయంతో ఉంది. ఇలా ఎటు పోతే అటు కష్టమే అనే స్థితిలో వైసీపీ చిక్కుకుపోయింది.2014కి ముందు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ తరహాలోనే ఇప్పుడు కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. కూటమి దృష్టిలో ఇది ఒక "మాస్టర్ స్ట్రోక్". గ్రామాలు, పట్టణాలు అన్నీ తమ ఆధీనంలోకి వస్తే, 2029 వరకూ వైసీపీని మళ్లీ లెగదీయడం కష్టమవుతుందని వ్యూహరచన చేశారు. మొత్తం మీద వైసీపీకి ఇప్పుడు రోడ్డెక్కడం ఖాయమన్నట్లే ఉంది. పోటీ చేస్తే పరాభవం.. బహిష్కరిస్తే పరువు పోతుంది. రెండు వైపులా దెబ్బ తినే పరిస్థితి. ఇలాగే కొనసాగితే వైసీపీకి స్థానిక ఎన్నికల్లో లెక్కలే ఉండవన్నది స్పష్టమే!

మరింత సమాచారం తెలుసుకోండి: