ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు ఉచిత చికిత్సలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు బిల్లులు చెల్లించాలంటూ ఆందోళనలు చేస్తున్నాయి, బిల్లులు ఇస్తేనే వైద్యం చేస్తామని తేల్చిచెప్పాయి. ఆస్పత్రులు ధర్నాలు, సమ్మెలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం చర్చలకు మొగ్గు చూపడం లేదు. ఇబ్బందుల్లో పేద రోగులు .. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యం కాని ఆపరేషన్లు, చికిత్సలు ఇంతకాలం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు చికిత్సలు ఆగిపోవడంతో చాలా మంది రోగులు అపాయింట్‌మెంట్‌లను వాయిదా వేసుకుంటున్నారు, లేదా అప్పులు చేసి సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారు.


 కొంతమంది నిస్సహాయంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఏ విధంగా చూసినా పేద రోగులకు తీరని కష్టం ఎదురవుతోంది. అయినప్పటికీ, ప్రభుత్వం ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలకు రాకపోవడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. త్వరలో కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ .. ఇదిలా ఉండగా, ప్రభుత్వం త్వరలో యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను తీసుకురాబోతోంది. సెప్టెంబర్ 2025లో క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ పథకం ద్వారా ఏపీలో ఉన్న అందరికీ (దాదాపు 5 కోట్ల మందికి) రూ. 25 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించనున్నారు. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే, నేరుగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆస్పత్రులకు చెల్లిస్తాయి.

 

రూ. 3000 కోట్ల బకాయిలు: అప్పటివరకైనా దారిలో ఉంచాల్సింది! .. ప్రస్తుతం ఆస్పత్రుల యాజమాన్యాలకు జగన్ హయాంలో పెట్టిన రూ. 2,700 కోట్ల బకాయిలతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం కలిపి సుమారు రూ. 3,000 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తే పాత బకాయిలు కోల్పోతామనే భయంతోనే ఆస్పత్రులు ఈ బంద్ ప్రారంభించాయి. కొత్త పథకం వచ్చేంత వరకు అయినా, ఆస్పత్రులకు ఏదో ఒక హామీ ఇచ్చి, పరిస్థితిని చక్కదిద్దాలని ప్రభుత్వానికి సూచనలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తోంది. పేద ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే, రోగుల కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: