చంద్రబాబునాయుడుపై నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఉన్న కోపం ఇపుడు బయటపడింది. నార్కెట్ పల్లి మండలంలోని అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాద వార్త తెలియగానే కుటుంబసభ్యులందరూ అర్జంట్ గా ఆసుపత్రికి చేరుకున్నారు. అందులో భాగంగానే కుటుంబంతో సహా చంద్రబాబు విజయవాడ నుండి ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టమ్ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందచేశారు. భౌతికకాయాన్ని కొద్దిసేపు ఇంట్లో ఉంచి తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకొస్తారని పార్టీ నేతలనుకున్నారు.
ట్రస్ట్ భవన్లో ఉంచాలని సూచించిన నేతలు
అయితే, అక్కడే అసలు సమస్య మొదలైందని సమాచారం. ముందుగా హరికృష్ణ భౌతికకాయాన్ని మెహదీపట్నంలోని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. బంధువులు, సన్నిహితల సందర్శన తర్వాత పార్ధివదేహాన్ని ఇంటి నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తీసుకెళ్ళాలని కుటుంబసభ్యులకు పార్టీ నేతలు సూచించారు. అందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తర్వాత కూడా కొందరు నేతలు ఒకటికి రెండు సార్లు సూచించినపుడు కుటుంబసభ్యులు పూర్తిగా వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతగా ఎందుకు వ్యతిరేకించారంటే, నేతల ద్వారా అడిగించింది చంద్రబాబేనట. తాను నేరుగా అడిగితే కుటుంబసభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో అనుకునే నేతలతో అడిగించారట. ఆ విషయం గ్రహించిన తర్వాతే కుటుంబసభ్యులు వ్యతిరేకించారట.
తిరస్కరించిన కుటుంబసభ్యులు
పార్టీ నేతలు, శ్రేణుల చివరి చూపు కోసం హరికృష్ణ భౌతికకాయాన్ని కాసేపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచేందుకు హరికృష్ణ కుటుంసభ్యులు ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించారు ? ఎందుకంటే, ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయంగా హరికృష్ణను పూర్తిగా అణగదొక్కేసింది చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలుసు. ఎంఎల్ఏ కాకుండా మంత్రి అయితే ఆరుమాసాల్లో ఎక్కడో ఒకచోట నుండి ఎంఎల్ఏ అవ్వాలి. లేకపోతే ఎఎంల్సీ సభ్యుడన్నా అవ్వాలి. కానీ హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి ఆరుమాసాల్లో ఉభయ సభల్లో ఎందులోనూ సభ్యత్వం కల్పించక పోవటంతో హరికృష్ణ రాజీనామా చేయాల్సొచ్చింది. అందుకు చంద్రబాబే కారణమంటూ అప్పట్లో హరికృష్ణే చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మళ్ళీ హరికృష్ణకు ఎంఎల్ఏ టిక్కెట్టు ఇవ్వలేదు, మంత్రిని చేయలేదు.
అడుగడుగునా అవమానాలే
ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడైన హరికృష్ణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. హరికృష్ణకు రాజీనామా చేయమని సన్నిహితల ద్వారా చెప్పించింది కూడా చంద్రబాబే అని పార్టీలో ఇప్పటికీ ప్రచారం జరుగుతునే ఉంది. తర్వాత ఎవరెవరికో రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినా హరికృష్ణకు మాత్రం ఇవ్వలేదు. పై రెండు అంశాలే కాదు అనేక విషయాల్లో హరికృష్ణను వాడుకోవటం అవసరం తీరిపోయిన తర్వాత దూరం పెట్టేయటం చాలా సార్లే జరిగింది. పొలిట్ బ్యూరోలో సభ్యత్వం ఇచ్చారు కానీ ఏనాడు పట్టించుకోలేదు. దాంతో హరికృష్ణ కూడా సమావేశాలకు వెళ్ళటం మానేశారు. పార్టీకి చెందిన చాలా సమావేశాలకు హరికృష్ణ హాజరుకాలేదు.
ఒత్తిడి పెట్టి ఒప్పించేవారా ?
హరితో ఏదైనా అవసరం వస్తే తాను మాట్లాడితే హరికృష్ణ వినరని తన భార్య భువనేశ్వరితోనో లేకపోతే సోదరుడు నందమూరి బాలకృష్ణతోనో చెప్పి చంద్రబాబు ఒప్పించేవారు. ఆ విధంగా హరికృష్ణ రాజకీయ జీవితం మొత్తం ఒడిదుడుకులు, అవమానాలతోనే సాగింది. ఇవన్నీ ఆయన కుటుంబసభ్యులకందరికీ బాగా తెలుసు. బ్రతికున్నంత కాలం అవమానాలకు గురిచేసి హరికృష్ణ భౌతికకాయాన్ని కూడా చిరవకు పార్టీ అవసరాలకు వాడుకుంటారన్న అనుమానంతోనే ట్రస్ట్ భవన్ లో ఉంచేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడలేదని సమాచారం. అంటే చంద్రబాబుపై హరికృష్ణ కుటుంబానికి ఎంతగా ధ్వేషముందో అర్ధమైపోతోంది.