పాకిస్థాన్ లో పేరుకు ప్రజాస్వామ్యమే ఉన్నా, అక్కడ పాలన నేపధ్యం అంతా సైన్యమే చూసుకుంటుందని ప్రచారం. ఆఖరికి న్యాయస్థానాలు కూడా దీనికి అతీతం కాదు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు మరో షాక్ తగిలింది. ఇటీవలే అక్రమాస్తుల కేసులో ఆయనకు,ఆయన కుటుంబానికి ఊరట లభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసులో ఊరట లభించిన షరీఫ్ కు ఇప్పుడు మరో షాక్ తగిలింది. లాహోర్ హైకోర్టు రాజద్రోహం కేసులో అక్టోబర్ 8వ తేదీన న్యాయస్థానంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
ఒక ఇంటర్వ్యూలో ముంబై దాడుల గురించి మాట్లాడినందకు ఆయనపై రాజ్యద్రోహం కేసు నమోదైంది. ఈ ఏడాది మేలో ఆయన డాన్ పత్రికతో మాట్లాడుతూ, ముంబై దాడు ల వెనుక పాకిస్తాన్ హస్తంఉందని పరోక్షంగా అంగీకరించారు. దాడులకుపాల్పడింది పాక్ ఉగ్రవాదులేనని తెలిపారు. పాక్ లో ఉగ్రవాదులు కదలికలు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలపై అమీన్ మాలిక్ అనే మహిళ కోర్టును ఆశ్రయించడం తో ఆయనకు తాజాగా ఈ సమన్లు అందాయి. 2017లో సుప్రీం కోర్టు షరీఫ్ ను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అక్రమాస్తుల కేసులో కోర్టు ఆయనకు పదేళ్లు జైలు శిక్ష విధించింది. అయినా ముంబై దాడులో పాక్ ప్రమేయం ఉందని మాట్లాడి నవాజ్ షరీఫ్ దేశద్రోహానికి పాల్పడ్డాడని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన లాహోర్ హైకోర్టు ఈ కేసులో డాన్ జర్నలిస్టు 'సిరిల్ ఆల్మైడా' కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అతడు కోర్టుకు హాజరుకాక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 8న అతన్ని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పంజాబ్ డీఐజీ ని ఆదేశించింది. మరో పక్క షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంపై కూడా ఆయన న్యాయవాది 'నాసిర్ భుట్టో' ను ప్రశ్నించింది. దీనికి నాసిర్ భుట్టో ఆయన తదుపరి వాయిదాకు హాజరవుతారని తెలిపారు. భార్య చనిపోవడం వల్ల ఆయన బాధ లో ఉన్నట్టు వివరించారు.