ఏపీలో కరోనా కట్టడికి జగన్ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన నిత్యావసర, అత్యవసర సేవలను అందించేందుకు అన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా లాక్డౌన్తో చేతిలో పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రేషన్కార్డు దారులందరికీ వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అర్చకులను ఆదుకునేందుకుం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. చిన్న దేవాలయాలలో పనిచేసే అర్చకుల కోసం ఒక్కొక్కరికి రూ. 5వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటి కష్టకాలంలో కూడా అన్నివర్గాల వారిని జగన్ సర్కార్ ఆదుకుంటోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించడమే మనముందున్న ఏకైన మార్గమని అంటున్నారు. ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ నిబంధనలను గౌరవించి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కాగా, ఏపీలో బుధవారం రాత్రి వరకు మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 348కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 9మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కర్నూలు, గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.