ఇండియన్ రైల్వేస్ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవలే ఇండియన్ రైల్వేస్ పండుగ సీజన్ నేపథ్యంలో మరో 392 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రూల్స్‌ను కూడా కఠినతరం చేసింది. ఈ రూల్స్‌ను ప్యాసింజర్లు అతిక్రమిస్తే భారీ జరిమానా పడుతుంది అలాగే కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చు.

అవేమిటంటే...ట్రైన్‌లో జర్నీ చేసే వారు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకోకపోయినా లేదంటే సరిగ్గా పెట్టుకోకపోయినా జరిమానా పడుతుంది. ఇంకా ప్రయాణికులు వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం కూడా పాటించాల్సి ఉంటుంది. కరోనా టెస్ట్ ఫలితాలు పెండింగ్‌లో ఉన్న వారు, లేదంటే కరోనా వైరస్ ఉన్న వారు రైల్వే స్టేషన్లలో ఉండటం లేదా ట్రైన్స్‌లో జర్నీ చేయడం శిక్షార్హం. ఇలా చేస్తే ప్రయాణికులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా పబ్లిక్ ప్లేస్‌ల్లో ఉమ్మివేయడాన్ని కూడా క్రైమ్ కిందకే పరిగణలోకి తీసుకుంటారు. శిక్ష ఎదుర్కోవలసి వస్తుంది. కోవిడ్ 19 వ్యాప్తికి కారణమైన వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని రైల్వే పోలీస్ ఫోర్స్ తెలిపింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 145, 153, 154 కింద వీరిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. ఏకంగా నెల రోజుల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో రైల్వే పోలీస్ ఫోర్స్ ఈమేరకు కఠిన నిబంధనలను జారీ చేసింది. అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: