బాలికల సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ బచావో.. భేటీ పడావో వంటి పథకాలేన్నో తీసుకొచ్చాయి. ఆడపిల్లను భారంగా భావిస్తున్న కొంతమంది తల్లిదండ్రులు పురింట్లోనే చంపేయడం లేదా..లింగ నిర్ధారణ పరీక్షలతో కడుపులోనే చంపేస్తు వస్తున్నారు. గతంలో ఇలాంటి ఘోరమైన పరిణామం ఎక్కువగా ఉన్నా..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషితో కొంతమేర సమసి పోయింది. అయితే పూర్తిగా సమసిపోలేదు. ప్రపచం వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నా..భారత్లో అత్యధికంగా ఉండటం గమనార్హం. అది కూడా హర్యానా లాంటి రాష్ట్రాల్లో పెచ్చురిల్లిపోతోందనే చెప్పాలి. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్(ఎస్డబ్ల్యూఓపీ-స్వాప్) యూఎన్ఎఫ్పీఏ 2020 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జెండర్ బేస్డ్ సెక్స్ సెలక్షన్(జీబీఎస్ఎస్-లింగ ఆధారిత ఎంపిక) వల్ల 142 మిలియన్ల మంది ఆడపిల్లలు తప్పిపోతుండగా వీరిలో 46 మిలియన్ల మంది భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
దాదాపు 4.6 లక్షల మంది బాలికలు తల్లి గర్భంలోనే లేక పుట్టిన వెంటనే కనిపించకుండా(అంటే చంపడం, వదిలించుకోవడం) పోతున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. హర్యానాతో పాటు వరుసగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్ రాష్ట్రాలు ఉండటం గమనార్హం. అంతేకాక ప్రతి వెయ్యి మంది పురుషులకు ఇక్కడ బాలికల సంఖ్య 900 కన్నా తక్కువ ఉండటం ఈ రాష్ట్రాల్లోని పరిస్తితి తీవ్రతకు అద్దం పట్టే విషయంగా చెప్పాలి. ఈ రాష్ట్రాల్లో బాలికలు బాల్య వివాహం, కట్నం, గృహ హింసతో పాటు లైంగిక వేధింపులకు కూడా గురవుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అంతేకాక బాల్య వివాహాల సంఖ్య కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ 2015-16 సర్వే గణాంకాల ప్రకారం, భారతదేశంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరికి 18 ఏళ్ళలోపే వివాహం జరగడం గమనార్హం. 20-24 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలలో 26.8 శాతం మంది 18 సంవత్సరాల వయస్సులోపు వివాహం చేసుకున్నారని నివేదిక తెలిపింది. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం బాల్యవివాహాల సంఖ్య గణనీయంగా తగ్గముఖం పట్టినట్లు స్పస్టం చేసింది. ఉన్నత విద్యనభ్యసించే బాలికల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది.