
సోనమ్ ప్రియుడు పేరు రాజ్ కుశ్వాహా. వీరిద్దరూ చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నారు. వీరి సంగతి సోనమ్ ఇంట్లో కూడా తెలుసట. రాజ్తో ప్రేమలో ఉన్నానని.. రఘువంశీని పెళ్లి చేసుకోనని తల్లితో చెప్పింది సోనమ్. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. బలవంతంగా రఘువంశీతో పెళ్లికి ఒప్పించారు. ఆ సమయంలో `పెళ్లి అయితే చేసుకుంటాను కానీ.. ఆ తర్వాత అతన్ని ఏం చేస్తానో చూడు` అంటూ తల్లిని సోనమ్ బెదిరించినట్లు రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసుల వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
వివాహం అయిన నాలుగు రోజులకే పుట్టింటికి వచ్చిన సోనమ్.. ప్రియుడ్ని రాజ్ ను కలిసి మాట్లాడింది. ఆ సమయంలోనే వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు. భర్త హత్యకు సోనమ్ రాజ్ తో కలిసి కిరాయి హంతకులను మాట్లాడింది. అందుకోసం తొలిత రూ. 4 లక్షలు ఇవ్వజూపగా.. ఆ తర్వాత రూ. 20 లక్షలుకు విశాల్ చౌహన్, ఆనంద్ కుమార్, ఆకాశ్ రాజ్పుత్లకు సుఫారీ ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
రఘువంశీ హత్య సమయంలో నిందితులతో పాటు సోనమ్ కూడా అక్కడే ఉంది. భర్త మృతదేహాన్ని లోయలో విసిరేసేందుకు ఆమె సహకరించిందని నిందితులు విచారణలో పేర్కొన్నారు. భర్తను చంపి ట్రైన్ లో ఇందౌర్ కు వచ్చిన సోనమ్.. ఒక రూమ్ రెంట్ కు తీసుకుని ప్రియుడు రాజ్ ను కలిసింది. అక్కడే వారిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆపై ఓ టాక్స్ లో సోనమ్ను యూపీకి పంపించాడు రాజ్. ఇంకోవైపు తనపై ఏం అనుమానం రాకుండా రఘువంశీ అంత్యక్రియల్లో రాజ్ కుశ్వాహా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇక రఘువంశీ హత్య కేసులో సోనమ్ మినహా మిగతా నలుగురు నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. నేడు సోనమ్ ను కోర్టులో హాజరుపరచనున్నారు.