
మా ఆస్తులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా... మా ఆస్తులన్నీ తీసేసుకున్నారు కదా.. కరెంటు బాకీలు కట్టారా.. ఇంత ద్రోహం ఈ రాష్ట్రానికి చేసి ఏపీకి వస్తారా.. బీఆర్ఎస్ నేతలకు కాస్త సిగ్గుండాలి కదా.. అంటూ మంత్రి పేర్ని నాని దుమ్ముదులిపేశారు. కేఏ పాల్ కూడా 175 సీట్లకు పోటీ చేశారని... బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుందని ఆ విషయంలో తప్పుపట్టాల్సిన పని లేదని మంత్రి పేర్ని నాని అంటున్నారు. బీఆర్ఎస్ ఏపీలో పోటీ చేస్తానంటే తప్పుపట్టాల్సిన అవసరం లేదన్న మంత్రి పేర్ని నాని.. తెలంగాణ మంత్రులు ప్రస్తుతం భయంలో ఉన్నారన్నారు.
మోదీ ఎక్కడ తమపై దర్యాప్తు సంస్థలను తెలంగాణకు పంపుతారోనని తెలంగాణ మంత్రులు భయపడుతున్నారన్న మంత్రి పేర్ని నాని.. తెలంగాణ మంత్రులే తమ పేర్లను మోదీ చీటీ తీస్తున్నారని చెబుతున్నారని వివరించారు. ఎవరి పేరు చీటీలో ఉంటుందోనని తెలంగాణ మంత్రులు భయపడుతున్నారన్న మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. కనీసం నవ్వుతారని కూడా లేకుండా పిచ్చి ప్రేలాపనలా.. అంటూ తెలంగాణ మంత్రుల తీరుపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
మొత్తానికి వైసీపీ మంత్రి బీఆర్ఎస్పై తొలిసారిగా ఘాటుగా స్పందించారు. దీంతో.. ఏపీలోనూ వైసీపీతో బీఆర్ఎస్ కుస్తీ ఉంటుందని అర్థమైపోయింది. అయితే.. బీఆర్ఎస్ రాకపై వైసీపీ అసహనం మాత్రం మంత్రి పేర్ని నాని మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఎవరి రాష్ట్రంలో వారు పాలించుకోక.. ఇలా సరిహద్దులు దాటటం ఏంటన్న అసహనం వైసీపీలో కనిపిస్తోంది.