తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మరో తీపి కబురు పంపింది. ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా... తాజాగా పశుసంవర్ధక శాఖలోని ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని.. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను (సీబీఆర్టీ) సెప్టెంబర్ 25న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లోనే పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. 5వ జోన్లో 67, ఆరో జోన్లో 184 పోస్టులున్నట్లు వివరించింది. పరీక్ష తేదీకి వారం ముందు నుంచి హాల్టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది.

జూలై 1 నాటికి 40 ఏళ్లలోపు ఉండి, వెటర్నరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు, రిజర్వేషన్ల వారీగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.