ఈ మొబైల్ ఎందుకురా బాబు అనే రోజులు దగ్గరికి వస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇకనుండి సెల్ఫోన్ అంటేనే భయపడేలా రీచార్జ్ ధరలు పెరగనున్నాయి. ఇన్నాళ్లూ చౌకగా లభించిన రీచార్జ్లతో ఎంజాయ్ చేసిన వారు ఇకనుండి సెల్ రిచార్జ్ అంటేనే జేబులు తడుముకునేలా టెలికాం ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఇక చౌక మొబైల్ చార్జీలకు మంగళం పాడాలని నిర్ణయించుకున్న టెలికాం ఆపరేటర్లు. ఈనెల 3 నుంచి కాల్ చార్జీలు భారీగా పెంచుతున్నారు.. ఇందులో మొబైల్ కాల్స్, డేటా చార్జీలను మంగళవారం నుంచి పెంచనున్నట్టు టెలికాం ఆపరేటర్ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్ విభాగంలో రెండు రోజులు, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్లతో పోలిస్తే తాజా ప్లాన్లు దాదాపు 42 శాతం మేరకు భారమవుతాయని భావిస్తున్నారు.
కాగా డిసెంబర్ 3 నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇకపోతే గత నెలలో డిసెంబర్ నుంచి మొబైల్ టారిఫ్లను పెంచుతామని భారత టెలికాం ఆపరేటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టెలికాం టారిఫ్ల సవరణపై ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా టారిఫ్ పెంపను ప్రకటించింది. మరోవైపు దేశంలో డిజిటల్ మళ్లింపు, డేటా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపని రీతిలో రానున్న వారాల్లో టారిఫ్లను పెంచుతామని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక ఎయిర్టెల్ సైతం టారిఫ్ల పెంపునకు రంగం సిద్ధం చేసింది. ఈ పెంపుల వల్ల సెల్ వినియోగదారులకు పడనున్న భారం పెద్దమొత్తంలో ఉండగా ఇప్పటికే జియో ప్రజలకోసం అని ఆఫర్లు పెట్టి ఇప్పుడు వాతలు పెడుతుంది. ఇకపోతే అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో ప్రవేశించిన రిలయన్స్ జియో మొబైల్ ఫోన్ కాల్ మరియు డేటా ఛార్జీలను పెంచుతామని చెప్పడం నిజంగా జీర్ణించుకోలేని విషయం. ప్రతి టెలికాం ఆపరేటర్లు కొత్తలో ఇలాగే వినియోగదారులను ఆశపెట్టి తమ మార్కెట్ను విస్తరించుకుని తరువాత వాతలు పెట్టడం పరిపాటిగా మారింది..