జగన్మోహన్ రెడ్డితో  పారిశ్రామిక ధిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అవ్వటం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయ, పారిశ్రామికవేత్తలకు వీళ్ళ భేటి ఏమాత్రం మింగుపడటం లేదు. గన్నవరం విమానాశ్రయంలో దిగేంత వరకూ జగన్ ను కలవటానికి ముఖేష్ తాడేపల్లికి వస్తున్నట్లు ఎవరికీ ఉప్పందలేదంటేనే విషయం ఎంత గోప్యంగా ఉంచారో అందరికీ అర్ధమవుతోంది.

 

సరే వీళ్ళ భేటికి కారణాలంటూ  చాలానే ప్రచారం జరుగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడైన పరిమళ్ ధీరజ్ నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వమని అడగటానికే ముఖేష్ సిఎంను కలిసినట్లు ప్రచారంలో ఉంది. నత్వానీని వెంటబెట్టుకుని జగన్ దగ్గరకు ముఖేష్ వచ్చాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అసలు వాస్తవం ఏమిటంటే నత్వానీయే ముఖేష్ ను జగన్ దగ్గరకు తీసుకొచ్చాడట.

 

జగన్ ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళి  అమిత్ షా ను కలిసినపుడు వైసిపికి రాబోయే నాలుగు రాజ్యసభ ఎంపి సీట్లలో తమకు ఒకటి కేటాయించాలని కోరినట్లు ప్రచారంలో ఉంది. ఆ విషయం నిజమేనట. అమిత్ అడిగిన ఆ ఒక్క సీటు నత్వానీ కోసమే అని బయటపడింది. ఎందుకంటే నత్వానీ అన్న వ్యక్తి ఇటు ముఖేష్ అటు బిజెపికి అంత్యంత ఇష్టుడట. రిలయన్స్ సామ్రాజ్య విస్తరణలో నత్వానీది చాలా కీలక పాత్రట. అందుకనే ఆయనకు ముఖేష్ అంత ప్రధాన్యత ఇస్తాడని సమాచారం.

 

సరే ఇక విషయానికి వస్తే అమిత్ షా ఒక రాజ్యసభ స్ధానాన్ని జగన్ ను కోరేముందు స్వయంగా నత్వానీయే వైసిపి ఎంపి విజయసాయిరెడ్డితో భేటి అయినట్లు సమాచారం. తమమధ్య భేటి విషయాన్ని జగన్ తో  విజయసాయి ప్రస్తావించాడట. జగన్ సానుకూలంగా స్పందించటంతో అదే విషయాన్ని నత్వానీకి విజయసాయి చెప్పాడట. ఆ తర్వాత అమిత్ ను కలిసిన నత్వాని జగన్ నిర్ణయాన్ని చేరవేశాడు. ఆ తర్వాతే తమ భేటిలో జగన్ దగ్గర  అమిత్ రాజ్యసభ ఎంపి కేటాయింపు హామీని తీసుకున్నాడు.

 

ఆ తర్వాత ముఖేష్ కు కేంద్ర హోంమంత్రి ఫోన్ చేసి వెళ్ళి జగన్ ను కలవాలని సూచించాడని సమాచారం. ఎలాగూ జగన్ –ముఖేష్ మధ్య గ్యాప్ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా సిఎంను కలిసి గ్యాప్ ను కూడా ఫిలప్ చేసుకోవాలని అమిత్ షా సూచించాడట. అదే విషయాన్ని ముఖేష్, నత్వానీ మాట్లాడుకుని విజయసాయిరెడ్డి ద్వారా జగన్ తో భేటిని ఏర్పాటు చేసుకున్నారు. నత్వానీకి ఓ రాజ్యసభ సీటు ఇవ్వటంలో జగన్ కు వచ్చే నష్టమేమీ లేదు. ఈ భేటిని అడ్డం పెట్టుకుని రిలయన్స్ పెట్టుబడుల విషయంలో జగన్ కూడా ముఖేష్ నుండి హామీ పొందాడట. ఇప్పుడర్ధమైందా వీళ్ళ భేటి వెనకున్న కథేంటో ?

మరింత సమాచారం తెలుసుకోండి: