కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గురించి వైద్య నిపుణులు అంచనా వేసినప్పటికీ ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి అన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. నిత్యం వేల ప్రాణాలు పోతున్నా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని అమలు చేసి ఈ కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు. వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేక కరోనాను ఎదిరించే శక్తి లేక అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. కరోనా నియంత్రణ చర్యలపై అవసరమున్న స్థాయిలో ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదన్న మాటలు వినబడుతున్నాయి. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్ లు ఇక్కడ పెద్ద ఎత్తున జనాలకు ఇచ్చి కాపాడడం వదిలేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు అన్న అపవాదు పెరుగుతోంది.
ఒక కుటుంబానికి కష్టమొస్తే తీర్చాల్సిన భాధ్యత ఆ కుటుంబం యొక్క పెద్దపై ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో ఆ కుటుంబ పెద్ద ఫెయిల్ అయితే అది వారి లోపాన్ని అసమర్థతను తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజల కొచ్చిన కష్టాన్ని గట్టెక్కించి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కానీ ఇక్కడ వీరి అనాలోచిత నిర్ణయాలు, మెరుపువేగంతో తీసుకోవాల్సిన చర్యలను ఆచరణలో పెట్టడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి అన్న భావన దేశ ప్రజలలో రోజురోజుకీ పెరిగిపోతోంది. 60 శాతంకి పైగా ప్రజలు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. కరోనా నుండి దేశ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలు ఇకనైనా అన్ని విధాలుగా చర్యలు వేగవంతం చేస్తారని ఆశిస్తున్నారు జనాలు.