దేశంలో కరోనా మహమ్మారి చికిత్సను కూడా వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ ఆసుపత్రుల గురించిన తెలిసిన విషయమే. తమ వద్దకు ప్రాణాలు అరచేత పట్టుకొని ఊపిరి ఆడక వచ్చిన వారిపై కూడా ఏమాత్రం కనికరం అనేది లేకుండా లక్షల్లో ఫీజులు గుంజాయి. ప్రాణాలను తన వ్యాపార పావులుగా మార్చి మహమ్మారితో ఆసుపత్రులు ఆడిన ఆటలో ఎందరో అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. చివరికి శవాలతో కూడా వ్యాపారం చేసిన ఘనత కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యానికే దక్కుతుంది. ఆరోగ్య శ్రీ పథకంతో వచ్చిన వారికి కూడా లక్షల్లో బిల్లులు వేసిన వైనం తెలిసిందే. కార్పొరేట్ ఆసుపత్రుల ఉదంతాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రుల ధన దాహానికి కళ్లెం వేసేందకు చర్యలు చేపట్టింది.


అయితే ఆసుపత్రుల ధన దాహంపై అఖిల భారత న్యాయవాద సంఘం ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణలో భాగంగా ప్రతి ఆసుపత్రి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే చికిత్స అందించాలని తెలపడంతో పాటు, ప్రతి ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ నోడల్ అఫీసర్ల విధులను నిర్థారించింది. అంతేకాకుండా ప్రతి ఆసుపత్రిలో ఇప్పటి వరకు జరిగిన నగదు బదీలీలను సరిచూసి ఎక్కువ మొత్తంలో రాబట్టిన ఆసుపత్రుల వద్ద నుంచి నగదును బాధితులకు తిరిగి ఇప్పించాలని కలెక్టర్లకు సూచించింది. ఇందులో భాగంగా చర్యలు చేపట్టిన కలెక్టర్లు ఇప్పటి వరకు దాదాపు 66 ఆసుపత్రులపై రూ.9.9 కోట్ల జరిమానా విధించారు. వీటిలో 20 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.


ఈ సందర్బంగా ప్రజలకు ఒరిగింది ఏముందని కొందరు అంటున్నారు. ఆసుపత్రుల ధన దాహార్తిని తీర్చలేక ప్రాణాలు విడిచిన వారి సంగతేంటని, వీరి బిల్లుల దెబ్బకు దడిసి అసలు ఆసుపత్రులకు రాకుండా వ్యాధి కారణంగా మరణించిన వారి చావుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుని కొందరికి నగదు తిరిగి ఇచ్చారు సరే కార్పొరేట్ల ధన దాహానికి బలైన వందల మంది మరణాలకు సమాధానం ఎవరు చెబుతారంటూ నిలదీస్తున్నారు. మరి వీరికి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: