చిహువా, మెక్సికో నుండి ప్రొసోర్స్ అనే సంస్థ ఉల్లిగడ్డలను దిగిమతి చేసుకుంది. అమెరికాలో ఉన్న పలు రెస్టారెంట్లకు, కిరాణషాపులకు ఉల్లిని సరఫరా చేసింది. చివరగా ఆగస్టు 27న ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఆ ఉల్లిని ఇండ్లలో, రెస్టారెంట్లలో ఉపయోగించారని సీడీసీ వెల్లడించింది. ఉల్లినే ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని గుర్తించారు. ఎక్కువకాలం పాటు నిలువ చేసిన ఉల్లిగడ్డలను వాడకూడదని అమెరికాలో సీడీసీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మూడు నెలలు నిలువ చేసిన ఉల్లిని అసలు వాడకూడదు అని సూచించింది. కొద్ది రోజుల పాటు ఉల్లిని వాడకపోవడమే మంచిదని సీడీసీ అభిప్రాయపడింది. జులై నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిని వెనక్కి తీసుకునేందుకు మెక్సికో ప్రొసోర్స్ సంస్థ ముందుకు వచ్చింది.
సాల్మొనెల్లా వ్యాదిగ్రస్తుల్లో డయేరియా, వాంతులు, జ్వరం, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సీడీసీ వివరించింది. బ్యాక్టీరియా ఉన్న ఉల్లిని తినడం ద్వారా ఆరుగంటల నుంచి ఆరు రోజుల లోపు ఎప్పుడైనా సాల్మొనెల్లొసిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చాలా మందికి ఎలాంటి చికిత్స చేయకుండానే వారం రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల ఆహారపదార్థాలను పరిక్షించినట్టు వెల్లడించారు అధికారులు. అమెరికాలో 37 రాష్ట్రాలలో ఇది వ్యాప్తి చెందిందని సీడీసీ తెలిపింది. ఎక్కువగా టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 160 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా మిస్సోరిలో 21 కేసులు నమోదైనట్టు తెలిసింది. ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగానే అందరూ అప్రమత్తంగా ఉండాలని సీడీసీ హెచ్చరించింది.