బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కిపోతోంది.  ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదల అయిన సంధర్భంగా  ప్రతి రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే తమదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అధికారాన్ని తిరిగి సాధించాలనే లక్ష్యంతో పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల హామీలు, వాగ్దానాలు చేస్తూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నాయి.తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకారం, బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి పార్టీ తమ మానిఫెస్టోలో ఓటర్ల మనసులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త ఆలోచనలు ప్రవేశపెడుతోంది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ చేసిన హామీ ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో సునామీ సృష్టించింది. ఇండియా కూటమి  అధికారంలోకి వస్తే, బీహార్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా కొత్త చట్టం తీసుకురావడం తమ మొదటి నిర్ణయం అవుతుందని ఆయన ప్రకటించారు“. ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తాం అని..అది కూడా 20 రోజుల్లో చట్టం తెస్తాం” అని హామీ ఇచ్చారు.


ఇది పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు. “మా పార్టీ అధికారంలోకి వస్తే, మా ప్రభుత్వం చేసే మొదటి సంతకం ఇదే. బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం మా వాగ్దానం. ఈ నిర్ణయాన్ని మేము చట్టంగా మార్చుతాం. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తాం. 20 నెలలలోపు ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వడం ఖాయం,” అని ఆయన తెలిపారు.తేజస్వి యాదవ్ ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. సాధారణంగా ఎన్నికల సమయంలో పార్టీలు ఇచ్చే హామీలు ఓటర్లను ఆకట్టుకునేలా ఉంటాయి కానీ, “ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం” అనే ఆఫర్ మాత్రం బీహార్ ప్రజల్లో భారీ ఆశలను రేకెత్తిస్తోంది.



ఈ హామీపై ప్రజల్లో ఉత్సాహం వ్యక్తమవుతుండగా, కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరియు ప్రత్యర్థి పార్టీ నేతలు మాత్రం దీనిని కేవలం ఎన్నికల స్ట్రాటజీగా చూస్తున్నారు.“ఇది నిజంగా సాధ్యమా? లేక ఓటర్లను ఆకర్షించేందుకు వేసిన ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.తేజస్వి యాదవ్ గతంలో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.అదే సమయంలో, ఆయన ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.“గత రెండు దశాబ్దాలుగా ఎన్డీఏ ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. మేము గతంలో చెప్పిన అనేక సంకల్పాలను ఇప్పుడు ప్రభుత్వం కాపీ కొట్టింది. కానీ అమలు చేయడంలో విఫలమైంది,” అంటూ తేజస్వి యాదవ్ మండిపడ్డారు.



తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే, సోషల్ మీడియాలో ““#TejashwiPromise” అనే హ్యాష్‌టాగ్ ట్రెండ్ అవ్వడం ప్రారంభమైంది. ప్రజలు, యువత పెద్ద ఎత్తున ఈ హామీపై స్పందిస్తూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు, కొందరు ఈ ప్రకటనను “ఎలక్షన్ గిమ్మిక్” అని విమర్శిస్తున్నారు.ఏదేమైనా, బీహార్‌లో ఎన్నికల వేడి ప్రస్తుతం తారస్థాయికి చేరింది. ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు చేస్తున్న హామీలు, నేతల విరుచుకుపడే వ్యాఖ్యలు రాజకీయ రంగాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. నవంబర్ 6తో మొదలయ్యే పోలింగ్ దశకు ముందు, ప్రతి పార్టీ తమ శక్తివంతమైన చివరి ప్రయత్నం చేస్తోంది.బీహార్ ప్రజలు ఈ సారి ఎవరి వైపు మొగ్గుతారనేది నవంబర్ 14న వెలువడే ఫలితాలతో తేలనుంది. కానీ ఇప్పటికి మాత్రం తేజస్వి యాదవ్ హామీతో బీహార్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: