చంద్రబాబునాయుడుపై జనాల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోందంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్ద బాంబే పేల్చారు. ఉండవల్లి గురించి ప్రత్యేకించి పరిచయటం అవసరం లేదు. ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పటం, అరటిపండును ఒలిచినంత సులభంగా వివరించటం ఉండవల్లికే సొంతం. ఉండవల్లి అందరి రాజకీయనేతల్లాగ కాకుండా మేధావిగా పేరున్న వ్యక్తి. ఈ మాజీ ఎంపి చెప్పే విషయాలకు బాగా క్రెడిబులిటీ ఉంటుంది. అటువంటిది చంద్రబాబు పై జనాల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోందని చెప్పటమంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఈమధ్యనే చంద్రబాబు-ఉండవల్లి భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు సలహాలు ఇవ్వటానికే ఉండవల్లి భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. వారి మధ్య భేటీలో ఏం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. అయితే, తాజాగా ఉండవల్లి మాటలు చూస్తుంటే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నది అర్ధమైపోతోంది.
జగన్ పై సానుకూలత
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే జగన్ విషయంలో ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఈ మాజీ ఎంపి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు కూడా జగన్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పటం గమనార్హం. ఇప్పటికైతే చంద్రబాబు-జగన్ మధ్యే పోటీ ఉందన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకత ప్రజల్లో బహిరంగంగానే కనిపిస్తోందని ఉండవల్లి చెప్పటం విశేషం. అయితే, చంద్రబాబు ఎన్నికల వ్యూహాల వల్ల చివర్లో ఫలితాలు మారిపోయే అవకాశాలు కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభావం ఇపుడే చెప్పలేం
ప్రత్యేకహోదా తీవ్రతను ఎన్నికల తర్వాత కానీ అంచనా వేసేందుకు లేదన్నారు. ఇపుడు జరిగే ఉద్యమాలు కేవలం ఎన్నికల్లో లబ్దిపొందేందుకే అంటూ కుండబద్దలు కొట్టారు. పవన్ కల్యాణ్ ప్రభావం ఎన్నికలు దగ్గరపడే సమయంలో మాత్రం తెలుస్తుందన్నారు. చంద్రబాబుతో భేటీ అంశంపై మాట్లాడుతూ తాను ఎవరు పిలిచినా వెళ్లి మాట్లాడుతానని చెప్పారు. తనకు ఎవరూ శతృవులు లేరని ఓ ప్రశ్నకు ఉండవల్లి అరుణ్ చెప్పటం గమనార్హం.