ఈ విశ్వానికే అధిపతి అయిన మహాశివునికి అత్యంత ప్రసిద్ధి చెందిన పలు  ప్రత్యేక దేవాలయాల గురించి మీరు వినే ఉంటారు. అయితే  పరమశివునికి సంబంధించి ఈ శివాలయం మరింత అద్భుతం. ఆ ముక్కంటికి  తప్ప ఎవరికీ అంతుచిక్కని రహస్యం ఒకటుంది.  అదే గుజరాత్ లోని నిష్కలంక్ ఆలయం. ఈ ఆలయం నిత్యం సముద్రంలో మునిగి తేలుతూ ఉంటుంది. అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతుంది. ఈ అరుదైన ఆలయం గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉంది. సముద్రం మద్యలో ఎంతో విచిత్రంగా ఉండే ఈ ఆలయం అప్పట్లో కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారింది అనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యం.

ఈశ్వర్ ఆలయంలోని శివలింగం ప్రాచీనమైంది అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం చాలా ఏళ్ల క్రితమే నిర్మించారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్క అంగుళమే బయటపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది.  మళ్లీ అదే తరహాలో సముద్రంలోకి మునిగిపోతుంది. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం, మళ్లీ విడిపోవడం వరకు మొత్తం ఈ  క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దే వేచి ఉంటారు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం సముద్రుడు ఇలా అభిషేకిస్తూ శివుని అర్థిస్తూ ఉంటాడని  భక్తుల ప్రగాఢ నమ్మకం.  

కొలియాక్ సముద్రంలో ఉన్న ఈ శివాలయం ఉదయం సముద్రంలో పూర్తిగా మునిగి ఉంటుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి జరిగి ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఈ సమయంలో భక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఆ పరమ శివుడ్ని దర్శించుకుంటారు. మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: