ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అనాతి కాలంలోనే దేశదేశాలు వ్యాప్తిచెంది.. లక్షల మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఇక ఈ కరోనా వచ్చినప్పటి నుంచీ మాస్క్ లేకుండా బయటకు రాలేని పరిస్థితి. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని ప్రభుత్వాలు తీవ్రంగా హెచ్చరించాయి. ఒకవేళ మాస్కులు కొనుగోలు చేయడం కుదరకపోతే ఇంట్లో చేసిన మాస్కులను ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
దీంతో ప్రజలంతా మాస్కులను ధరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఎక్కువసేపు మాస్కులు ధరించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. ముఖం మీద చర్మంలో మంట, గీతలు, మరకలు వంటివి ఏర్పడుతాయి. అలాగే చర్మంపై దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలను అధిగమించడానికి వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. అది కూడా, నీటిని వేడి చేసి.. తులసి ఆకులను వేసి చల్లబరచి త్రాగండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
మరియు చర్మంపై దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చర్మంపై చాలా చెమట ఉన్నవారు మాస్క్ వేసే ముందు, వారి చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోండి మరియు ఆయిల్ ఫ్రీ క్రీమ్ కూడా వాడాలి. ఆయిల్ ఫ్రీ క్రీమ్ వాడకం వల్ల ముఖం మీద చెమట తగ్గుతుంది. అదేవిధంగా, మాస్క్ వేసుకోవడానికి అర గంట ముందే ఫేస్ క్రీమ్ అప్లై చేయండి. మీరు యాంటీ బాక్టీరియల్ క్రీమ్ను కూడా ఉపయోగించవచ్చు, ఈ క్రీమ్ ముఖం మీద చికాకు మరియు దద్దుర్లు తగ్గిస్తుంది. ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చుకోవాలి. లేదంటే అనేక చర్మ సమస్యలు వస్తాయి. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.