తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఈ రోజు కుళ్లిన స్థితిలో రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ప్రేమికులు చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఘటనా స్థలంలో ఓ బైక్ ఉంది. నెలరోజుల క్రితం వీరు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే.. వీరికి సంబంధించిన విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రేమికులు ఏ ప్రాంతానికి చెందిన వారు..? ఎక్కడి నుంచి వచ్చారు..? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు..? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. నిరంతరం పర్యాటకులు వచ్చే అనంతగిరి అడవుల్లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ విధించిన తర్వాతే ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పలువురు భావిస్తున్నారు.