ప్రపంచంలో ఇప్పుడు కరోనా వైరస్ బెంబేలెత్తిస్తుంటే.. మరోవైపు తుఫాన్లతో ప్రజలు విల విలలాడిపోతున్నారు. ఇటీవల కాలంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చైనా, ఉగాండా ల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా మరోవైపు ప్రకృతి బీభత్సాలతో సామాన్యులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ లోని బురిగంగా నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పడవలో ప్రయాణిస్తున్న 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ‘మార్నింగ్ బర్డ్’ అనే పడవ మున్షిగంజ్ నుంచి సదర్ ఘాట్ వైపు వెళ్తున్న సమయంలో మౌయురి-2 అనే నౌకను ఢీకొట్టింది.
దాంతో ఆ పడవ మునిగిపోయింది.. అందులో 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఆ పడవలో ముగ్గురు పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. పడవ మునిగిపోయిన సమయానికి కొంత మంది ఈత కొట్టుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 23 మంది మృతి చెందగా మరికొంత మంది గురించి గాలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు.