నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా పెళ్లి ప్రపోజల్ ని తిరస్కరించినందుకు పాతికేళ్ల యువతిని కాల్చి చంపిన ఘటన పాకిస్థాన్ లో కలకలం రేపుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్‌ (25) పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్‌ నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది.

ఈ తరుణంలో ఆమెకు సాద్‌ అమీర్‌ భట్‌, జాహీద్‌ జడూన్‌ పరిచయమైయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్‌ లో నివసించే ఆమె బాబాయి మహ్మద్‌ నాజీర్‌ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు.

అయితే మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టుకు నిమితం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతురాలి మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్‌ వీసా లభిస్తుందనే ఆశతో పెళ్ళికి ప్రపోజ్ చేసినట్లు తేలింది.

కాగా.. ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్‌ హత్యలో అమీర్‌ భట్‌ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్‌ అధికారి సిద్రా ఖాన్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్‌ అధికారులు కూడా ఆరా తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: