ప్రముఖ సినీనటుడు, మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) వ్యవస్ధాపక అధ్యక్షుడు కమల్ హాసన్ కు విషయం అర్ధమైపోయినట్లుంది. సినీ సెలబ్రిటీ హోదాలో ఏమి చేసినా చెల్లుబాటవుతుంనే పరిస్ధితి లేదన్న విషయం ఎన్నికల ఫలితాలతో స్పష్టంగా అర్ధమైపోయింది. ఎందుకంటే 234 సీట్లలో ఎంఎన్ఎం పార్టీ 150 సీట్లకు పోటీచేసింది. ఒక్కటంటే ఒక్క సీటులో కూడా గెలవలేదు. చివరకు కమల్ కూడా ఓడిపోయారంటేనే పరిస్ధితి ఏమిటో స్పష్టమైపోయింది. తనతో పాటు యావత్ జట్టంతా ఓడిపోయిన తర్వాత తత్వం భోదపడినట్లుంది. అందుకనే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని ఆల్ మోస్టు డిసడైడ్ అయ్యారనే ప్రచారం పెరిగిపోతోంది. నిజానికి జనాల తీర్పుచూసిన తర్వాత కమల్ కు రాజకీయాలంటేనే విరక్తి పుట్టుంటుందనటంలో సందేహంలేదు. తెరమీద కనిపించినపుడు అభిమానించిన జనాలు తెరముందుకు వచ్చినపుడు కూడా అభిమానించాలనేమీ లేదని తేల్చిచెప్పారు.






దాంతో విషయం అర్ధమైపోయిన కమల్ ఇకనుండి తన సమయాన్ని టీవీల్లో షోలు, సినిమాలకే కేటాయించాలని డిసైడ్ అయిపోయినట్లు ప్రచారం ఊపందుకుంది. నిజానికి సినీ సెలబ్రిటీల హోదాలో ఏదో పార్టీలో చేరి పోటీచేయటం వేరు. అలాకాకుండా ఏకంగా సొంతంగా పార్టీపెట్టి నడపటం వేరు. సినీ హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి సక్సెస్ అయ్యింది చివరిసారిగా ఎన్టీయార్ మాత్రమేనేమో. ఎన్టీయార్ తర్వాత చాలామంది సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చినా ఏదో పార్టీలో చేరి పోటీచేసినపుడు కొందరు గెలిచారు మరికొందరు ఓడిపోయారు.  అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు తమిళనాడులో విజయకాంత్, శరత్ కుమార్, కర్నాకటలో ఉపేంద్ర లాంటి వాళ్ళు పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సెలబ్రిటీలపై జనాల్లో నమ్మకం లేకపోవటమే.





ఇక కమల్ విషయానికి వస్తే ఎంఎన్ఎం పార్టీ రెండేళ్ళ క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసింది. 39 లోక్ సభ స్ధానాల్లో పోటీచేసిన అభ్యర్ధుల్లో ఎవరికీ డిపాజిట్లు కూడా రాలేదు. అయితే కొన్ని అసెంబ్లీ సీట్లలో మాత్రం ఒకమాదిరిగా ఓట్లొచ్చాయి. దాంతో అప్పటినుండి కొంత ఉత్సాహంగానే కమల్ రాష్ట్రంలో తిరిగారు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఒకవైపు టీవీషోలో, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు రాజకీయాలు సింగిల్ హ్యాండెడ్ గా చూసుకోవాల్సొచ్చింది. అయినా కొంతకాలం ఇలాగే నడిపించారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దాంతో షోలు, సినిమాలకు ఫులిస్టాప్ పెట్టి రాజకీయాల్లోనే తిరిగారు. తాజాగా 150 అసెంబ్లీ సీట్లలో పార్టీ తరపున అభ్యర్ధులను పోటీలోకి దింపితే ఎక్కడా ఒక్క అభ్యర్ధి కూడా గెలవలేదు. చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ధక్షిణ కోయంబత్తూరు నుండి పోటీచేసిన కమల్ కూడా ఓడిపోయారు. దాంతో రాజకీయాలు తనకు అచ్చిరాదనే అభిప్రాయం కమల్లో పెరిగిపోయిందంటున్నారు. అందుకనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి కేవలం షోలు, సినిమాల్లో మాత్రమే కంటిన్యు అయితే ప్రశాంతంగా ఉంటుందని కమల్ చివరకు అభిప్రాయానికి వచ్చేశారట. కాబట్టి రాజకీయతెరపై కమల్ కనబడేది అనుమానమేనట.

మరింత సమాచారం తెలుసుకోండి: