పుల్వామా దాడిలో భారత సైనికులను టార్గెట్ చేసుకొని ఉగ్రదాడి జరిగిన సంఘటనలో నలభై మంది జవాన్లు అమరులయ్యారు. దాంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై పగతో రగిలిపోయిన భారత్ నిన్న తెల్లవారు జామున బాలాకోట్ లో వాయుసేన మెరుపుదాడులు నిర్వహించి 300 మంది ఉగ్రవాదులను హతం చేసింది.
ఈ క్రమంలో భారత్ సినిమాల్ని నిషేధిస్తున్నట్లు పాకిస్తాన్ సమాచారం మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటించారు. అంతేకాదు మేడిన్ ఇండియా ప్రకటనల్ని కూడా నిషేధించాలని పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీకి సూచించారు.
‘భారత కంటెంట్ను సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ బహిష్కరించింది. ఇక పాకిస్థాన్లో భారత్ సినిమాలు విడుదల కావు. మేడిన్ ఇండియా ప్రకటనలకు వ్యతిరేకంగా పీఈఎమ్ఆర్ఏ వ్యవహరించాలని సూచించాం’ అని ఫవాద్ ట్వీట్ చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ.. పాకిస్తాన్ నటీనటులతో కలిసి పని చేయకూడదని భారత చిత్ర పరిశ్రమ ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే.