అయితే ఈ సినిమాకి 24, 361 లేదా 24, 48 ఇలా ఏదో ఒక నెంబర్ ని టైటిల్ గా పెట్టాలనుకున్నారు. కానీ చివరికి క్షణక్షణం అనే పేరుని ఖరారు చేశారు. ప్రతినాయకుడిగా పరేష్ రావేల్ ని తీసుకున్నారు. ఈ సినిమాలోని ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. 50 రోజుల్లోనే సినిమా పూర్తి కావాల్సి ఉంది కానీ శ్రీదేవి తండ్రి పోవడంతో ఆమె చాలా రోజుల వరకు షూటింగ్ లో పాల్గొనలేదు. దీంతో సినిమా షూటింగ్ పూర్తయ్యే సరికి 18 నెలల సమయం పట్టింది. ఈ సినిమా రూ.1 కోటి 50 లక్షల బడ్జెట్ తో పూర్తయింది.
క్షణ క్షణం మూవీ తో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా రామ్ గోపాల్ వర్మ 2 నంది అవార్డులు అందుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి కి ఉత్తమ నటీమణిగా నంది అవార్డు లభించింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎం ఎం కీరవాణి కి సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. దీన్ని బట్టి ఈ సినిమా ఎంత అద్భుతంగా తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన జామురాతిరి జాబిలమ్మ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎంతో మధురంగా పాడారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో 'జంబారే' పాట తప్ప మిగిలిన పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.