టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా, నటిగా భారీ గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి జయలలిత. ఇప్పటికీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే ఉంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ లో సైతం నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
'బంగారు గాజులు', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ లో తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన జీవితంలో ఎన్నోసార్లు మోసపోయానని ఈ సందర్భంగా పేర్కొన్నారు." సినిమాల్లోకి రాకముందు నేనొక క్లాసికల్ డ్యాన్సర్ని. దేశవ్యాప్తంగా 1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను.నేను వాంప్ పాత్రల్లో నటించడానికి కారణం కూడా అదే. ఆ తర్వాత వినోద్ అనే దర్శకుడిని ప్రేమించాను. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. అతను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో నాతో అడల్ట్ సీన్ చేశాడు. దాంతో అతడికి దూరంగా ఉండాలనుకున్నా. కానీ అతను పెళ్లికి ఒప్పుకోకుంటే చచ్చిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లయిన మరుసటి రోజే అతడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోస్తానని చెప్పాడు. గదిలో బంధించారు. సన్నిహితుల సాయంతో ఆ జైలు నుంచి బయటపడ్డాను" అని చెప్పారు. " నేను కష్టపడి సంపాదించుకున్న 4 కోట్లు ఈమధ్య పోగొట్టుకున్నాను. రాఘవేంద్రరావు దగ్గర అనిల్ గజపతిరాజు డ్రైవర్ గా పని చేసేవాడు. రాఘవేంద్రరావు గారి సీరియల్స్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ ఇంటికి వచ్చి కార్ లో పిక్ చేసుకొని వెళ్లేవాడు. తర్వాత అతను కుందనపు బొమ్మ అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. అమ్మ. అమ్మ.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేసాను. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని, అందుకే అలా విసిరేస్తోందని నా వెనకాల చాలామంది తిట్టేవారు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు" అంటూ తెలిపారు."