బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ రీసెంట్ గా 'ఆదిపురుష్' మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సర్స్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే కృతిసనన్ ఈ ఏడాది ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి కృతి సనన్ దిగిన ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదే సమయంలో తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని కూడా చెప్పింది. తాజాగా ఇదే విషయంపై మరోసారి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కృతి సనన్.

" అల్లు అర్జున్ ని మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన అద్భుతమైన నటుడు. తన నటనకి నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పనిచేసే క్షణం కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా" అంటూ మరోసారి తన మనసులో కోరికను బయట పెట్టింది కృతి సనన్.

అంతేకాకుండా తాను నిర్మాతగా తీస్తున్న ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.." మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నిర్మిస్తున్న 'దో పత్తి' అనే సినిమా సవాళ్లతో కూడుకుంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్ కి నిర్మాతగా వ్యవహరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా" అని చెప్పుకొచ్చింది కృతి సనన్.  బన్నీ తో కలిసి నటించాలని ఉందని ఈ హీరోయిన్ చెప్పడం ఇది మొదటిసారి కాదు. తనకు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందిస్తూ బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా దానికి ఆమె స్పందిస్తూ..' మీతో కలిసి నటించాలని ఉందంటూ' రిప్లై ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: