ప్రముఖ సినీ నటులు, యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకుంది. జంగ్లీ రమ్మీ, A23, జీత్ విన్, లోటస్ 365 వంటి అనధికారిక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా, మొత్తం 29 మంది సెలబ్రిటీలపై ఈ.సి.ఐ.ఆర్ (ECIR) నమోదు చేసింది. ఈ కేసులో పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్, 1867తో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) ప్రకారంగా కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.


ప్రముఖులు ఇరుక్కున్న జాబితా : ఈ కేసులో ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, అలాగే మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, శ్రీముఖి, శోభా శెట్టి, హర్ష సాయి, శ్యామల తదితరులు ఉన్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా ఇందులో ఉన్నారు. వీరందరిపై త్వరలోనే సమన్లు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు: ఈ కేసుకు సంబంధించి ఫణీంద్ర శర్మ, వినయ్ వంగల లాంటి వ్యక్తుల ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. అలాగే పులి కుమార్ రెడ్డి అనే వ్యక్తి తాను బెట్టింగ్ యాప్‌లో ₹3 కోట్ల నష్టం చూశానని స్పష్టంగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.



సెలబ్రిటీల వివరణలు : ఈ ఆరోపణలపై స్పందించిన కొంతమంది సెలబ్రిటీలు, తాము తప్పకుండా చేసిన ప్రమోషన్లే అయితే, కొన్ని యాప్‌లు తమ అగ్రిమెంట్ ముగిసిన తరువాత కూడా వీడియోలు వాడుతున్నాయని, మరికొందరు ఆ యాప్‌లు లెగల్ అనే భావనతో ప్రచారం చేశామని పేర్కొన్నారు.  ప్రముఖుల ప్రమోషన్ వలన ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు నమ్ముతూ భారీగా నష్టపోతున్నారని, వినోదం పేరుతో గాంబ్లింగ్‌ను ప్రోత్సహించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అక్రమ గాంబ్లింగ్ ప్రమోషన్‌పై ఇది మొదటి దశ చర్య మాత్రమే అని పేర్కొన్నారు. ఇండస్ట్రీని కంపించే ఈ కేసులో మరిన్ని పేర్లు బయటపడే అవకాశం ఉంది. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: